శ్రీలంకలో ఇటీవలే జరిగిన వరుస బాంబు పేలుళ్లలో సుమారు 300 మంది మృత్యువాత పడగా, 500 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయినవారిలో 8 మంది భారతీయులు ఉన్నారు. ఈ ఘటన నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ తృటిలో తప్పించుకున్నారు. ఎన్నికల పూర్తయ్యి ఫలితాలకు ఇంకా టైమ్ ఉండటంతో ఆయన స్నేహితులతో టూర్కి వెళ్లిన ఆయన కింగ్స్జ్యూరీ హోటల్కు చెందిన ఫ్లాట్లోనే బసచేశారు.
పేలుళ్ల సమయంలో కూడా ఫ్లాట్లోనే ఉన్నారు.ఈయన బసచేసిన పక్క అపార్ట్మెంట్లో కూడా పేలుళ్లు జరిగాయి. దీనితో స్టన్ అయిపోయిన ఆయన తన స్నేహితులతో కలిసి ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం సోమవారం రాత్రి శ్రీలంక నుంచి బయలుదేరాలి. కాని ఈ ఘటన తరువాత ఆదివారం ఉదయమే ఎయిర్పోర్ట్కు చేరుకోగా అక్కడ కూడా బాంబులు పెట్టారన్న సమాచారంతో విమాన రాకపోకలను నిలిపివేశారు.
దీంతో రాత్రంతా ఎయిర్పోర్ట్లోనే గడిపి ఉదయం చెన్నై విమానం ఎక్కి అక్కడి నుంచి సాయంత్రం విశాఖ చేరుకున్నారు. ఆయన క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ వారు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు సోమవారం రాత్రి నుండి శ్రీలంక ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించింది. దేశం మొత్తం హై అలెర్ట్ విధించారు. వరుస బాంబుపేలుళ్ల నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఓ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థకు చెందిన 40 మందిని అరెస్ట్ చేశారు. ఈ దాడులకు ఏ ముఠా బాధ్యత వహించలేదు.