విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్స వేడుకలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గవర్నర్ తన ప్రసంగంలో మూడు రాజధానుల గురించి ప్రస్తావించడం గమనార్హం. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కేబినెట్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు.
రాజధాని విధులను మూడు ప్రాంతాల్లో పంపిణీ చేసే నిర్ణయం తీసుకుందని చెప్పారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, అమరావతిలో శాసన రాజధాని, కర్నూల్లో జ్యుడీషియల్ రాజధాని పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. పాలన వికేంద్రీకరణ ద్వారా…ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరం తగ్గుతుందని గవర్నర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అభివృద్ధి, వికేంద్రీకరణతోనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుందని హరిచందన్ అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి గవర్నర్ అనుకూలంగా ఉన్నారా అనే అనుమానాలు బయలుదేరాయి. ప్రభుత్వం ఎవరిదైనా గవర్నర్ పేరు మీదే ప్రభుత్వం ఉంటుందని అందుకే ఆయన ప్రభుత్వం రాసిచ్చిన స్పీచ్ చదువుతారనినిపుణులు అంటున్నారు.
అయితే బీజేపీ వారు మాత్రం అధికారిక కార్యక్రమాల్లో గవర్నర్ చేసే ప్రసంగాలు ప్రభుత్వమే రాసి ఇస్తుందని, కేవలం అది ఆయన చదవడం మాత్రమే చేస్తారని, అంతకు మించి ఇందులో ఏమీ లేదని అంటున్నారు. రాష్ట్ర బీజేపీ మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.