google-x andhra pradesh!రాష్ట్ర విభజన జరిగిన నాటి నుండి ఏపీలో పెట్టుబడుల కోసం చంద్రబాబు సర్కార్ ఎలా ప్రయత్నాలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బహుశా ఈ మూడేళ్ళ నుండి పడిన కష్టాలకు ప్రతిఫలాలు ప్రస్తుతం దక్కుతున్నాయేమో గానీ, వరుసగా టాప్ కంపెనీలన్నీ ఏపీ సర్కార్ తో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇటీవలే కియో మోటార్స్ ఏపీతో అగ్రిమెంట్లపై సంతకాలు చేయగా, తాజాగా గూగుల్ వంతు వచ్చింది.

అవును…. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – గూగుల్ ఎక్స్ కంపెనీ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏపీ మంత్రి నారా లోకేశ్, గూగుల్ ఎక్స్ సీఈవో ఒప్పందాలపై సంతకాలు చేశారు. తాజా ఒప్పందం ప్రకారం ఏపీలో “గూగుల్ ఎక్స్” సెంటర్‌ ను ఏర్పాటు చేయనున్నారు. అమెరికా తర్వాత ప్రపంచంలోని మరో దేశంలో గూగుల్ ఎక్స్ ఇంతవరకు కార్యకలాపాలు ప్రారంభించలేదు. భారత్‌లో అడుగుపెడుతూనే ఏపీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుండడం విశేషం.

విశాఖపట్టణంలో అతి త్వరలో “గూగుల్ ఎక్స్” డెవలప్‌మెంట్ సెంటర్‌ ఏర్పాటు కానుంది. గూగుల్ ఎక్స్ రాకతో కమ్యూనికేషన్ రంగంలో భారీ మార్పులు సంభవిస్తాయని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రజలకు అనేక సేవలు అందిస్తామని, సర్టిఫికెట్ లెస్ గవర్నెన్స్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 2 వేల ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ లింక్స్, అలాగే కేబుల్ అవసరం లేకుండానే మొబైల్ డేటా, వై-ఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి.