అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న గూగుల్ సంస్థలో మేనేజర్ గా పని చేస్తున్న 27 ఏళ్ళ వెనెస్సా మర్కొటీ ‘హత్యా’చారానికి గురికావడం కలకలం రేపుతోంది. న్యూయార్క్ గూగుల్ కార్యాలయంలో పని చేస్తున్న వెనెస్సా మార్కొటీ మసాచుసెట్స్ లోని ప్రిన్స్ టన్ నగరంలో తల్లి వద్దకు వీకెండ్ కు వెళ్లింది. ఆదివారం మధ్యాహ్నం వాకింగ్ కు వెళ్లిన వెనెస్సా ఎంతసేపటికీ ఇల్లు చేరకపోవడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కుమార్తె గురించి విచారించిన పోలీసులు వాకింగ్ కు వెళ్లిందని తెలుసుకుని స్నిఫర్ డాగ్స్ ను రంగంలోకి దించారు.
వెనెస్సా వాకింగ్ కు వెళ్లిన గ్రామీణ ప్రాంత రహదారిలో కొంత దూరం వెళ్లిన డాగ్స్… రోడ్డు పక్కనున్న పొదల వద్ద ఆగిపోయాయి. అక్కడ సగం కాలిన స్థితిలో వున్న మృతదేహం లభ్యమైంది. ఒంటిపై దుస్తుల్లేని ఆ మృతదేహం కాలిపై గాయాలు ఉండడంతో… ఆమెను అత్యాచారం చేసి, హత్య చేశారని, గుర్తుపట్టకుండా ఉండేందుకు కాల్చేశారని పోలీసులు అనుమానించారు. పోస్టుమార్టం నివేదిక కూడా వారి అనుమానాలను నిజమని తేల్చింది. ఆమె దారుణమైన అత్యాచారానికి గురైందని, అనంతరం హత్యకు గురైందని వారు తెలిపారు. అయితే ఆమెపై ఈ దారుణానికి పాల్పడ్డవారు ఎంతమంది? అనే విషయాన్ని నివేదిక వెల్లడించలేదు.
గత కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో ఇలాంటి దారుణాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. టెక్కీలే టార్గెట్ గా అత్యాచారాలకు పాల్పడుతున్న మృగాళ్ళ కధలు విని విని దాదాపుగా విసుగు వచ్చినంత పనయ్యింది. అయితే అమెరికాలోనూ మహిళలపై ఈ తరహా దాడులు జరగడం… ప్రధాన వార్తల్లో నిలిచింది. అందులోనూ వెబ్ ప్రపంచాన్ని ఏలే గూగుల్ వంటి సంస్థకు చెందిన మహిళ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.