నంది అవార్డుల వివాదంపై వైసీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు స్పందించారు. వాస్తవానికి నంది అవార్డులపై ఎలాంటి వివాదం లేదని… అవార్డుల్లో కులాలకు ఆస్కారం లేదని అన్నారు. అవార్డులు రానివారు రచ్చ చేయడం సాధారణమైన అంశమేనని చెప్పారు.
ఒక్కసారి అవార్డులను ప్రకటించిన తర్వాత… వాటిని వెనక్కి తీసుకోవడం ఉండదని అన్నారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అవార్డులపై ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తాను నంది అవార్డును స్వీకరిస్తే ‘కమ్మోడివి కాబట్టే అవార్డు వచ్చిందా’ అంటారని… అందుకే అవార్డును తిరస్కరిస్తున్నానని పోసాని అన్న విషయం తెలిసిందే.
అవార్డులను రద్దు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో ఆధార్, ఓటర్ ఐడీ లేని వారు మాట్లాడుతున్నారంటూ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఆదిశేషగిరిరావు స్పందించారు.