‘పురచ్చితలైవి’ జయలలిత కన్నుమూసి వారం రోజులు గడుస్తున్నా మృతిపై సందేహాలు వీడడం లేదు. ఈ క్రమంలో సినీ నటి గౌతమీ రాసిన లేఖ అందరినీ ఆలోచింపజేసింది. ‘అమ్మ’ వచ్చేస్తారని ప్రకటించిన తర్వాతి రోజే అమ్మ పరిస్థితి సీరియస్ గా ఉందని ప్రకటించడమేంటని, ఆ తర్వాత కన్నుమూశారని చెప్పడమేంటంటూ లేఖలో గౌతమీ కురిపించిన ప్రశ్నల వర్షం దేశవ్యాప్తంగా సంచలనాత్మకమైంది. అయితే దీనిపై అన్నాడీఎంకే నేతల నుంచి తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పార్టీకి వ్యతిరేకంగా సాగుతున్న కుట్రలో గౌతమీ పావుగా మారారని, కుట్రదారులకు ఆమె అమ్ముడుపోయారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ తరుణంలో ఏ మాత్రం వెనక్కి తగ్గని గౌతమీ ప్రధాని మోడీ మరో లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. “తన తొలి లేఖలో తాను లేవనెత్తిన సందేహాలనే చాలా మంది కూడా ప్రశ్నిస్తున్నారని, తాను అడిగిన ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ప్రధాని మోడీ నుంచి సమాధానాలను తాను ఆశిస్తున్నానని” గౌతమీ ప్రస్తావించారు. మరి ఈ విషయంలో ప్రధాని స్పందిస్తారో? లేదో? వేచిచూడాలి.