ఏ పార్టీ అధికారంలో వుంటే… గంటా శ్రీనివాస రావు ఆ పార్టీలో వుంటారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా వున్న ఆయన, అధికా రంలో వున్న వైసీపీలో చేరడానికి సిద్ధం అవుతున్నట్టు సమాచారం. టీడీపీలో రాజకీయ జీవితం ప్రారంభించిన గంటా.. ఆతర్వాత ప్రజారాజ్యంలో చేరారు. 2009లో ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం కావడంతో… మంత్రి కూడా అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ టీడీపీ గూటికి చేరారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి మరోసారి మంత్రి కూడా అయ్యారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో.. కొంతకాలంగా ఆ పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. దీంతో అప్పటి నుంచే ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతూ వస్తోంది.
గంటా తో పాటు మరింత మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తే జగన్ ఆయనకు సముచిత గౌరవం ఇస్తా అని మాట ఇచ్చారట. మంత్రి పదవి ఇస్తే గతంలో చంద్రబాబుపై తాను చేసిన విమర్శలకు అర్ధం ఉండదు కాబట్టి విశాఖపట్నం మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎండీఏ) చైర్మన్ ని చేస్తా అని జగన్ మాటిచ్చారట.
ఈ నెలాఖరుకే పార్టీలో చేరి… అక్టోబర్ మొదటి వారంలోనే ఆ పదవిని ఆయన చేపట్టబోతున్నారట. గంటా రాకను ఆ పార్టీ మంత్రి అవంతి శ్రీనివాసరావు… పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి గట్టిగానే వ్యతిరేకిస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయంలో తన మాటే ఫైనల్ అని జగన్ తేల్చి చెప్పేశారట.