కాంగ్రెస్ కు రాజీనామా చేసి తెరాసలో చేరిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు ఎందువల్ల తాము పార్టీ మారవలసి వచ్చిందో చెప్పడానికి గాను ముఖ్య అనుచరులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు కంట తడిపెట్టుకున్నారని తెలియవచ్చింది. పార్టీ మారుతున్న సందర్భంగా వారు భావోద్వేగానికి గురి అయ్యారు. పదవుల కోసం తాము పార్టీ మారలేదని , అబివృద్ది కోసం మారుతున్నామని ఈ సందర్భంగా వారు చెప్పడం విశేషం.
కంట తడి పెట్టుకున్నంత మాత్రాన అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాం అంటే నమ్మే వారు ఎవరైనా ఉంటారా? వెంకటరమణారెడ్డి భార్య జ్యోతి మాట్లాడుతూ తనకు జడ్పి చైర్ పర్సన్ పదవి కోసం పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తోసిపుచ్చారు. తమకు పదవులు ముఖ్యం కాదన్నారు. ఆవిడ చెప్పింది నిజమే అనుకుందాం అయితే జడ్పి చైర్ పర్సన్ పదవికి తెరాస ఆమెను సెలెక్టు చేస్తే నేను తీసుకోబోనని వారు చెప్పగలరా? కార్యకర్తలను కనీళ్లతో మస్కా కొట్టి వారితో తెరాసలోకి తీసుకుని వెళ్లడమే ప్లాన్ అని కాంగ్రెస్ వారు అంటున్నారు.
ఈ సమయంలో తమ నిర్ణయం వల్ల కొందరు బాధపడి ఉండొచ్చునని, కానీ ఎవరికీ అన్యాయం జరగదని పేర్కొన్నారు. తమతో పాటు వస్తే తెరాసలో న్యాయం జరిగేలా చూస్తాం అని చెప్పడం ఉద్దేశంగా కనిపిస్తుంది. గండ్ర వెంకటరమణ రెడ్డి చేరికతో కాంగ్రెస్ నుండి తెరాసలోకి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరింది. ఇంకో ఇద్దరు వెళ్ళగానే కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా పోతుంది. డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కు కేవలం 19 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే.