నిన్న అనంతపురం జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సులో కర్ణాటకకు తరలిస్తున్న భారీ మొత్తంలో డబ్బు పోలీసులు పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా చీరల బాక్సులలో వీటిని సద్దారు. వచ్చే నెలలో కర్ణాటకలో ఎన్నికలలో పంచడానికి ఈ డబ్బు తరలిస్తున్నట్టు తెలిసింది.
ఈ డబ్బు ఎవరిది అనేది పోలీసులు తేల్చనప్పటికీ గాలి జనార్ధనరెడ్డి కోసం ఒక ప్రముఖ పార్టీ ఈ డబ్బు పంపుతున్నట్టు లోకల్ గా ప్రజలు అనుకుంటున్నారు. బళ్లారి జిల్లాలో గాలి అనుచరులకు ఏడు సీట్లు కేటాయించింది బీజేపీ. వీరిలో గాలి సోదరుడు సోమశేఖరరెడ్డి కూడా ఉన్నారు. ఆయన బళ్లారి నుండి పోటీ చెయ్యబోతున్నారు.
ఈ ఎన్నికలలో సత్తా చాటితే కేసులు మాఫీ చేసి సోమశేఖరరెడ్డిని డిప్యూటీ సీఎం చేస్తామని బీజేపీ అధిష్టానం ఆఫర్ ఇచ్చిందట. దీనికోసం అన్ని అవకాశాలను వాడుకుంటున్నారట గాలి వర్గం. ఒకప్పుడు ఆంధ్రలోని పాత పరిచయాలు వ్యాపారాల నుండి అవసరమైన సొమ్ము కర్ణాటక తెప్పిస్తున్నారట.
ఈ ఎన్నికలలో గనుక బీజేపీ గెలిచి గాలి వర్గం విరివిగా సీట్లు సాధిస్తే గాలికి పూర్వవైభవం వచ్చినట్టే అని భావిస్తున్నారు పరిశీలకులు. అయితే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ తన సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంది. బీజేపీ కంటే కాంగ్రెస్ కాస్త ముందంజేలో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి ఏం జరగబోతుందో!