విభజన చట్టంలో ఇచ్చిన మాట ప్రకారం కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చెయ్యకపోవడంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో గాలి జనార్ధనరెడ్డి మీడియా ముందుకు వచ్చి అవకాశం వస్తే కడపలో తలపెట్టిన బ్రాహ్మణి స్టీల్స్ రెండు సంవత్సరాలలో మొదలుపెడతామని, లేని పక్షంలో తాము పెట్టిన పెట్టుబడి తిరిగితే దానిని ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధమని చెప్పుకొచ్చారు.
గాలి జనార్ధనరెడ్డి ఉన్నఫళంగా తెర మీదకు రావడంతో అందరు ఒకింత ఆశ్చర్యపోయారు. ఇటీవలే జరిగిన కర్ణాటక ఎన్నికలలో గాలి మళ్ళీ బీజేపీ గూటికి చేరారు. ఆయన వర్గానికి టిక్కెట్లు కూడా ఇచ్చారు. దీనితో ఇప్పటికే గాలి జనార్ధనరెడ్డికి మేలు చెయ్యాలి ఈ విషయంలో అనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు అనిపించకమానదు.
అటుచేసి ఇటు చేసి ఈ ప్రాజెక్టును ఆయనకే కట్టబెడతారా అనే అనుమానం అందరిని వేధిస్తుంది. ఒకప్పుడు అవినీతి చక్రవర్తిలా వైఎస్ అండతో చెలరేగిపోయిన గాలి కేంద్రం అండతో మళ్ళీ చక్రం తిప్పబోతున్నారా? మరోవైపు ఉక్కు కర్మాగారం కోసం దీక్ష చేస్తున్న సీఎం రమేష్, బీటెక్ రవి ఏడో రోజు కూడా తమ దీక్షను కొనసాగిస్తున్నారు.