ఆస్కార్ వేడుక అనగానే ఎర్రతివాచీ స్వాగతం, లేటెస్ట్ వేషధారణ, కళ్లు మిరుమిట్లు గొలిపే లైటింగ్, అందాల భామల హొయలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖుల ఆలింగనాలు… ఇలా ఎన్నో విశేషాలు కనువిందు చేస్తాయి. అవార్డుల ప్రదానోత్సవంలో పురస్కారాలు గెల్చుకున్న వారిని అందరూ అభినందిస్తారు, ప్రశంసిస్తారు. అయితే, ఇదే కార్యక్రమంలో ఎలాంటి పురస్కారం పొందని భారతీయ, అంతర్జాతీయ నటి ఫ్రీదా పింటో (స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్) ఓ మంచి పని చేసి అంతర్జాతీయ సినీ ప్రముఖుల ప్రశంసలు పొందింది.

సాధారణంగా ఆస్కార్ వేడుకలు నిర్వహించే సమయంలో ఆహూతులకు భారీ విందు ఏర్పాటు చేస్తారు. ఈ విందులో చాలా ఆహార పదార్థాలు మిగిలిపోయాయి. మామూలుగా అయితే ఇలాంటి వేస్టేజీని పారబోస్తారు. ఇక్కడే ఫ్రీదా పింటో మంచి ఐడియాతో పని చేసింది. ఈ విందు ఏర్పాట్లు చేసిన కోపియా హోటల్ తో కలిసి అలా మిగిలిపోయిన ఆహారపదార్థాలను సేకరించి, వాటిని ప్యాక్ చేయించి, లాస్ ఎంజెలెస్ లోని నిరాశ్రయులు, నిరుపేదలకు పంచిపెట్టింది. ఈ మేరకు ఇన్ స్టాగ్రాంలో ఓ పోస్టు చేసింది.

ఆస్కార్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని, అంతకంటే కొపియా హోటల్ తో కలిసి చేసిన మంచి పని మరింత ఆనందాన్నిచ్చిందని పేర్కొంది. ఈ బ్లాక్ బ్యూటీ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రెడ్ కార్పెట్ పై అందాల ప్రదర్శనతో ప్రపంచ దృష్టిని ఆకట్టుకోవడమే లక్ష్యంగా వచ్చే హీరోయిన్లకు షాక్ నిచ్చే విధంగా, ఓ మంచి పనితో ప్రపంచం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుని, అభినందనలతో ముంచెత్తే విధంగా చేసుకుంది ఈ ఇండియన్ ఆరిజిన్ బ్యూటీ.