freedom-251-delivery16జిబి మెమరీ కార్డు కూడా రానటువంటి ధరకు ఏకంగా ఒక స్మార్ట్ మొబైల్ ను తయారుచేసి ఇస్తామని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘రింగింగ్ బెల్స్’ కధ ముగిసిపోయిందని అంతా అనుకున్న తరుణంలో మళ్ళీ ప్రపంచ మొబైల్ దిగ్గజాలకు కంటిమీద కునుకు లేకుండా చేసే ప్రకటన ఇచ్చింది. ఈ నెల 28 నుంచి తొలి విడతలో భాగంగా 30 వేల మంది వినియోగదారులకు ‘ఫ్రీడం 251’ ఫోన్ల డెలివరీని మొదలుపెట్టనున్నట్లు సదరు సంస్థ డైరెక్టర్ మోహిత్ గోయల్ చెప్పారు.

సామాన్య ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకున్న ‘రింగింగ్ బెల్స్’ సంస్థ, 2,500 విలువ గల స్మార్ట్ ఫోన్ ను 251కే ఇస్తామని చెప్పడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే సదరు కంపెనీపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే అప్పటికే ఆ సంస్థ ప్రకటనకు హోరెత్తిన మద్దతుతో 30 వేల మంది ‘ఫ్రీడం 251’ ఫోన్లను బుక్ చేశారు. మరో 7 కోట్ల మంది కూడా తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

విమర్శల జడివాన నేపథ్యంలో 30 వేల మంది చెల్లించిన సొమ్మును వాపస్ చేసిన రింగింగ్ బెల్స్ కనుమరుగైందని భావించిన తరుణంలో సోమవారం నాడు డెలివరీ డేట్ ప్రకటన జారీ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసారు. ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పధ్ధతిన ఫోన్లను అందించిన తర్వాతే వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటామని డైరెక్టర్ మోహిత్ గోయల్ పేర్కొన్నారు. దీంతో సదరు సంస్థపై వెల్లువెత్తిన విమర్శలకు సరైన సమాధానం చెప్తున్నట్లవుతోంది.