ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై ఇటీవలే టీడీపీ నుండి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిగా అమరావతి కొనసాగకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. ఇదే విషయమై బీజేపీ అధిష్టానంతో సీఎం జగన్ చర్చించారని, బీజేపీ అధిష్టానమే తనకు ఈ విషయాన్ని చెప్పిందన్నారు. ఏపీకి ఒకటి కాదు.. నాలుగు రాజధానులు ఉండబోతున్నాయని చెప్పుకొచ్చారు. విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప జిల్లాలు ఏపీకి రాజధానులు కాబోతున్నాయని పేర్కొన్నారు.
ఇది నూటికి నూరుశాతం నిజం అని ఆయన ఉద్ఘాటించారు. బహుశా ఇలా చెయ్యడం వల్ల అన్ని ప్రాంతాల వారిని సంతృప్తి పరచవచ్చని జగన్ అభిప్రాయం కావొచ్చు. ప్రతిపక్షంలో ఉండగా అమరావతికి వ్యతిరేకంగా మిగతా ప్రాంతాల జనాలను వైఎస్సార్ కాంగ్రెస్ రెచ్చగొట్టింది. ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఈ చర్యకు జగన్ పూనుకోవచ్చు. అయితే ఇటువంటి ప్రయోగం ఇప్పటివరకూ దేశంలో జరగలేదు. దాని వల్ల కొత్త ఇబ్బందులు కూడా మొదలు కావొచ్చు. పరిపాలన మరింత కష్టసాధ్యం అవుతుంది.
ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి మునుముందు కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం ఉండదని మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి నిన్న ప్రకటించారు. దీనిబట్టి రాజధాని మార్పు విషయంలో కేంద్రం రాష్ట్రప్రభుత్వానికి ఎటువంటి సహకారం అందించదు అని అర్ధం అవుతుంది. మరోవైపు అమరావతి నుండి రాజధాని తరలింపుపై భూములు ఇచ్చిన రైతులు ప్రతిపక్ష పార్టీల నాయకులను కలుస్తున్నారు. వారికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 30,31న రాజధాని గ్రామాలలో పర్యటించనున్నారు.