తెలంగాణ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారిన గ్యాంగ్ స్టర్ నయీమ్ కూడబెట్టిన ఆస్తుల చిట్టా పోలీసులకే దిమ్మ తిరిగేలా చేస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో వందలాది ఎకరాల భూములను కబ్జా చేసిన నయీమ్ భారీ నేర సామ్రాజ్యాన్నే స్థాపించినట్లుగా ఖరారవుతోంది. హైదరాబాద్ లోని అలకాపురిలోని ఇంటిలోనే 2 వేల కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించగా, తాజాగా మరోసారి అలకాపురి ఇంటిలో పోలీసులు చేసిన సోదాల్లో, నయీమ్ కు చెందిన మరిన్ని కీలక పత్రాలు పోలీసుల చేతికి చిక్కాయి.
ఇప్పటిదాకా పోలీసులకు చిక్కిన నయీమ్ ఆస్తుల విలువ ఎంతలేదన్నా 4 వేల కోట్లకు పైమాటేనని సమాచారం. ఈ సందర్భంగా నయీమ్ చెందినట్లుగా భావిస్తున్న ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీని ఓపెన్ చేసిన పోలీసులు అందులో నయీమ్ ఆస్తులతో పాటు దోస్తుల జాబితాను చూసి షాక్ తిన్నారు. ఈ జాబితాలో ఏకంగా 15 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారుల పేర్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించడం కలకలం రేపుతోంది. ఈ 15 మంది ఐపీఎస్ అధికారులు, ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ పోలీసులు – నయీమ్ లింకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులపై విచారణకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని అడిషనల్ ఎస్పీని సిట్ అధికారులు విచారించనున్నారు. నయీమ్ డైరీలో ఉన్న నాలుగు రాష్ట్రాల ఐపీఎస్ లు, అడిషినల్ ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్ స్పెక్టర్లకు సంబంధించిన బాగోతం బయటపడనుంది. కరీంనగర్, నల్గొండకు చెందిన డీఎస్పీలు, ఇన్ స్పెక్టర్లు, ఒడిశా ఛత్తీస్ గఢ్ ఐపీఎస్ లతో నయీమ్ కు నేరుగా సంబంధాలున్నట్లు ఈ డైరీ ద్వారా తెలుస్తోంది.
మావోయిస్టుల ఆపరేషన్ నిమిత్తం ఒడిశా, ఛత్తీస్ గఢ్ ఐపీఎస్ అధికారులు నయీమ్ ను వాడుకున్నారని ఈ డైరీ సమాచారం. దీంతో నయీమ్ కు సహకరించిన ఐపీఎస్ అధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. సిట్ విచారణలో తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనన్న భావన వారిని బెంబేలెత్తిస్తోంది.