ఎప్పుడో సెప్టెంబర్ లో జరిగే ‘మా’ ఎన్నికలకు ఇప్పటినుండే హడావిడి మొదలైపోయింది. ఇప్పటికే నలుగురు ‘మా’ అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ ఈ పోటీకి సిద్ధమవుతున్నట్లుగా ప్రకటించారు. తాజాగా ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ని కూడా ప్రకటించారు.
ఈ ఎన్నికలలో మెగాస్టార్ చిరంజీవి మద్దతు కీలకం కాబోతుంది. ప్రస్తుతానికి ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉన్న ఆయన ఎవరికి మద్దతు ఇస్తే ఆ అభ్యర్థికి ఎడ్జ్ కాయమని అంటున్నారు. అయితే ఇప్పటివరకు తాను ఎవరికి మద్దతు ఇవ్వనున్నారనేది ఇంకా గుట్టు విప్పలేదు. అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ ని చూస్తే ప్రకాష్ రాజ్కే చిరంజీవి మద్దతు ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది.
ప్యానెల్ లోని శ్రీకాంత్, సాయికుమార్, బ్రహ్మాజీ, ఉత్తేజ్, బండ్ల గణేష్, చిరంజీవి మనుషులుగా పరిశ్రమలో పేరొందారు. ఇక సురేష్ కొండేటి అయితే చిరంజీవి పర్సనల్ పీఆర్ఓ అని అందరికీ తెలిసిందే. పైగా ఇప్పటికే ప్రకాష్ రాజ్ తరపున మెగా బ్రదర్ నాగబాబు బహిరంగంగానే మద్దతు తెలుపుతున్నారు.
పోటీలో ఉన్న మంచు విష్ణు… తనకు ప్రస్తుత అధ్యక్షుడు నరేష్, సూపర్ స్టార్ కృష్ణ, రెబెల్ స్టార్ కృష్ణంరాజుల మద్దతు ఉన్నట్టు చెబుతున్నారు. చిరంజీవి, మోహన్ బాబుల స్నేహం కారణంగా మెగాస్టార్ తనకే మద్దతు ఇస్తారని విష్ణు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తానికి చిరంజీవి తటస్థంగా ఉండి పోయే అవకాశం ఉందని కూడా అంటున్నారు.