రానూ రానూ ‘రంగుల’ ప్రపంచంలోని అన్ని రంగులు బయటపడుతున్నాయి. ఒకప్పుడు తెరవెనుకకు మాత్రమే పరిమితమయ్యే విషయాలు, ఇప్పుడు బట్టబయలు అవుతుండగా, అందులో భాగంగానే తాజాగా ఓ మోడల్ ఉదంతం వెలుగుచూసింది. తనను వేధింపులకు గురి చేశాడంటూ, టీవీ నటుడు, ‘కైసే హై యే యారియాన్’ ఫేమ్ పార్థ సంతాన్ పై కేసు నమోదైంది. పార్థ తనను లైంగికంగా వేధించాడని 20 సంవత్సరాల మోడల్ ముంబై పరిధిలోని బంగర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఐపీసీ 354ఏ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి పార్థకు సమన్లు పంపగా, ఇంతవరకు విచారణకు హాజరు కాలేదని తెలుస్తోంది. గత నెలలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు, పార్థ వేధింపులకు పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. గతంలోనూ పార్థపై ఇదే విధమైన ఆరోపణలు వచ్చాయి. అయితే ఇలాంటి కేసులు రోజుకొకటి వెలుగు చూస్తున్నా, చివరికి ఎంతమందికి న్యాయం జరుగుతోంది? ఎంతమంది తమకు న్యాయం జరిగే వరకు వేచిచూస్తున్నారు? అన్నది మాత్రం ప్రశ్నార్ధకమే!