Fidaa Trailer Talkహరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన “దువ్వాడ జగన్నాధమ్” సినిమా ధియేటర్లలో ప్రత్యక్షమైంది. ఈ సినిమా టాక్ పూర్తి స్థాయిలో బయటకు రావడానికి మరికొంత సమయం పడుతుంది గానీ, ఈ సినిమా ఇంటర్వెల్ లో ఓ రెండు సినిమా ట్రైలర్లను ప్రదర్శించారు. అందులో ఒకటి తేజ – రానాల “నేనే రాజు నేనే మంత్రి” కాగా, మరొకటి శేఖర్ కమ్ముల – వరుణ్ తేజ్ ల “ఫిదా” ట్రైలర్.

ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదలైన రానా సినిమా ట్రైలర్ కు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతుండగా, “ఫిదా” ట్రైలర్ మాత్రం కేవలం ‘డీజే’ ధియేటర్లలోనే ప్రదర్శితమవుతోంది. అయితే ఈ ‘ఫిదా’ ట్రైలర్ సినిమాపై ఇప్పటివరకు ఉన్న ఆసక్తిని, అంచనాలను పూర్తిగా తగ్గించేసిందని చెప్పవచ్చు. శేఖర్ కమ్ముల క్లాస్ లుక్స్ కనపడుతున్నాయి గానీ, ట్రైలర్ కటింగ్ అత్యంత నిరాశజనకంగా ఉందని చెప్పవచ్చు.

హీరోయిన్ గా ‘ప్రేమమ్’ ఫేం పల్లవి తెలుగు ప్రేక్షకులను రంజింప చేయడం కష్టమనిపించే విధంగా హీరోయిన్ లుక్స్ ఉండగా, హీరోగా వరుణ్ తేజ్ చేయడానికి ఏమీ లేదన్నట్లుగా కనపడుతోంది. బహుశా సినిమాలో వచ్చే స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను సంతృప్తి పరుస్తారేమో జూలై 21వ తేదీన తేలనుంది గానీ, ఈ ట్రైలర్ తో ప్రేక్షకులను “ఫిదా” చేయాలంటే, శేఖర్ కమ్ముల ఆశలు నెరవేరదని తేలిపోయింది.