ఒకప్పుడు అగ్ర హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సంగీత దర్శకుడు మణిశర్మ పాటలు, ఇటీవల కాలంలో చాలా అరుదుగా మాత్రమే వినపడుతున్నాయి. అవి కూడా చిన్న చిన్న చిత్రాలకు కావడం, అలాగే ఆశించిన స్థాయిలో మణి సంగీతం లేకపోవడంతో, సంగీత ప్రియులతో పాటు, మణి అభిమానులు కూడా నిరుత్సాహ పడుతున్నారు. అయితే చాలాకాలం తర్వాత వంశీ రూపొందిస్తున్న ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మణి.
ఈ సినిమాలో సెకండ్ సాంగ్ ను తాజాగా విడుదల చేయగా, మణిశర్మ స్వరపరచిన సంగీతం విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో వంశీ మార్క్ సంగీతం స్పష్టంగా కనపడుతున్నప్పటికీ, బ్యాక్ గ్రౌండ్ లో మణి మార్క్ డ్రమ్స్ బీటింగ్ కూడా ఆకట్టుకుంటోంది. అలాగే చిత్రీకరించిన విధానం కూడా పాటను మరో మెట్టు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. ‘రవివర్మ చిత్రమా’ అనే లిరిక్స్ తో ప్రారంభమైన ఈ పాటకు… గోదావరి అందాల నడుమ వంశీ మార్క్ టేకింగ్ ప్లస్ పాయింట్ గా మారింది.