cattle-olx‘ఓఎల్ఎక్స్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫోన్ల నుంచి ద్విచక్ర వాహనాల వరకు అన్నింటినీ ఇందులో పెట్టి అమ్మేస్తున్నారు. అయితే హరియాణాలోని సోనిపట్‌ కు చెందిన రాకేశ్ కత్రి అనే రైతు మాత్రం ఈ ‘ఈ-కామర్స్’ ప్లాట్‌ ఫాంను పశువులు అమ్మేందుకు వినియోగించుకుంటూ శభాష్ అనిపించుకుంటున్నాడు. 12వ తరగతి వరకు చదువుకున్న రాకేశ్ గత నాలుగు నెలలుగా ఓఎల్ఎక్స్ ద్వారా 25 ఆవులు, గేదెలను విక్రయించిన వైనం వెలుగు చూసింది.

ఈ అమ్మకాల ద్వారా ఏకంగా లక్ష రూపాయల లాభాన్ని కూడా ఆర్జించాడు. వాట్సాప్‌ ద్వారా తన యాడ్స్‌ ను చూసిన వారు తనను సంప్రదిస్తుంటారని రాకేశ్ తెలిపాడు. ఇటీవల అశోక్, బాబు అనే ఇద్దరు వ్యక్తులు రాకేశ్ యాడ్‌ ను చూసి అతడిని కలిశారు. రాకేశ్ ఆలోచన తమకు స్ఫూర్తి ఇచ్చిందని పేర్కొన్నారు. ఇప్పుడు తాము ఓఎల్ఎక్స్‌ లో పశువుల ఫొటోలు చూసి నచ్చితే విక్రయదారులను కలిసి బేరం కుదుర్చుకుంటున్నట్టు తెలిపారు.

టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించుకుంటున్న రాకేశ్ కత్రి మరెందరికో ఆదర్శంగా నిలిచాడు. ఇదిలా ఉంటే మరో ‘ఈ-కామర్స్’ సైట్ ‘క్వికర్‌’లో ఇటీవల ఆవు పిడకలకు సంబంధించిన ప్రకటనలు కూడా కనిపిస్తున్నాయి. ‘స్వచ్ఛమైన ఆవుపేడతో తయారు చేసిన పిడకల కోసం సంప్రదించండి’ అంటూ వస్తున్న యాడ్లు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.