ఏపీలో ఇప్పటికే విపక్షం వైసీపీ నుండి 20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు అధికార పార్టీలోకి టీడీపీలో చేరిపోగా, మరింత మంది వైసీపీ నేతలు క్యూలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ పరిస్థితి ఇలా ఉంటే, తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు కూడా టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చేరికలతో ఏపీలో కీలక జిల్లాగా ఉన్న కృష్ణాజిల్లాలో టీడీపీ మరింత బలోపేతం కానుందన్న ప్రచారం ఊపందుకుంది.
కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న దేవినేని నెహ్రూ టీడీపీ వైపు చూస్తున్నట్లుగా గత కొన్నాళ్ళుగా మీడియా వర్గాల్లో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. గతంలో టీడీపీలోనే ఉన్న దేవినేని, పార్టీ చీలిక నేపథ్యంలో ఎన్టీఆర్ తరఫున నిలిచారు. కాలక్రమేణా కాంగ్రెస్ లో చేరిన నెహ్రూ, నాటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ అంతకంతకూ కుచించుకుపోతుండడంతో, నెహ్రూ పార్టీ మార్పు తధ్యం అన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో వ్యక్తమయ్యింది.
నెహ్రూ సంగతి ఇలా ఉంటే, ఇదే జిల్లాకు చెందిన మరో సీనియర్ రాజకీయవేత్త, కాంగ్రెస్ పార్టీకే చెందిన బూరగడ్డ వేదవ్యాస్ కూడా టీడీపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఓ దఫా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన వేదవ్యాస్ రెండు రాష్ట్రాల ప్రజలకు సుపరచితులే. మెగాస్టార్ చిరంజీవి రాజకీయ తెరంగేట్రంతో ప్రజారాజ్యం పార్టీలో చేరిన వేదవ్యాస్.., ఆ తర్వాత విలీనంతో తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేశారు. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న వేదవ్యాస్, మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనేందుకు టిడిపితో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన వీరిద్దరూ టీడీపీలో చేరితే… కృష్ణాజిల్లాలో పార్టీ మరింత బలోపేతం కానుందని టిడిపి వర్గాల తరపు నుండి వినిపిస్తోన్న వాదన.