వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ జట్టు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇప్పటివరకు శ్రీలంక పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొడుతూ సరికొత్త స్కోర్ ను నమోదు చేసింది. మంగళవారం నాడు పాకిస్తాన్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవర్లలో ఏకంగా 444 పరుగులు చేసి, అంతకు ముందు శ్రీలంక జట్టు నమోదు చేసిన 443 పరుగుల రికార్డును బద్దలు కొట్టింది. ఈ రికార్డుతో పాటు పాకిస్తాన్ తో జరుగుతున్న వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది ఇంగ్లండ్ జట్టు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టులో ఓపెనర్ హలేస్ 122 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సర్లతో 171 పరుగులు చేయగా, వన్ డౌన్ బ్యాట్స్ మెన్ రూట్ 85 పరుగులు చేసాడు. వీరిద్దరూ రెండవ వికెట్ కు 248 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాత బట్లర్, మోర్గాన్ లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో చివరి 12 ఓవర్లలో ఏకంగా 161 పరుగులు వచ్చాయి. బట్లర్ 51 బంతుల్లో 90, మోర్గాన్ 27 బంతుల్లో 57 పరుగులతో సత్తా చాటారు. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ షాట్లకు పాక్ బౌలర్ వహాబ్ రియాజ్ 10 ఓవర్లలో సెంచరీ పూర్తి చేసుకుని 110 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇక, భారీ లక్ష్య చేధనలో ఏ మాత్రం పోరాటపటిమను ప్రదర్శించలేకపోయింది పాక్ జట్టు. ఓపెనర్ శార్జీల్ ఖాన్ 58, చివరి బ్యాట్స్ మెన్ మొహమ్మద్ అమీర్ 58 పరుగులు మినహా మిగతా వారంతా చేతులెత్తేయడంతో, 42.4 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 169 పరుగులతో విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు, 5 మ్యాచ్ ల సిరీస్ లో 3-0 తో ముందంజలో ఉంది. ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే సిరీస్ సొంతం కావడంతో, ‘వైట్ వాష్’పై దృష్టి సారించింది.