కరోనా కారణంగా స్థానిక ఎన్నికలు అప్పట్లో వాయిదా పడి ఆ తరువాత పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. అయితే కరోనా ఏ మాత్రం తగ్గకపోయినా దేశంలో అన్ని పనులూ మొదలు అయిపోతున్నాయి. దీనితో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు కూడా పూర్తి చెయ్యాలని ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్టు సమాచారం.
ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి అక్టోబర్లో ఉప ఎన్నిక జరగనుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 60కి పైగా అసెంబ్లీ స్థానాలకు బైపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆ జాబితాలో దుబ్బాక కూడా ఉంది.
బిహార్ అసెంబ్లీ గడువు నవంబర్ నెలలో ముగుస్తోంది. దీంతో అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటివారంలో ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో దుబ్బాకకు కూడా ఉప ఎన్నిక జరగనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఏపీలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
అప్పట్లో జరిగిన ఏకగ్రీవాల విషయంలో ఏం జరుగుతుంది అనేది చూడాలి. అంగబలం, అర్ధబలంతో ఏకగ్రీవాలు చేసుకున్నారని అప్పట్లో ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. మొత్తం ప్రక్రియ మొదటి నుండీ ప్రారంభిస్తే అధికార పార్టీ నిరాశపడటం ఖాయం.