Election Commission seize Rs 570 crore from containers in Tamil Naduమరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ఎన్నికల కమిషన్ దిగ్భ్రాంతి చెందేలా రెండు కంటెయినర్లలో తరలిస్తున్న 765 కోట్లు కరెన్సీ పట్టుబడింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఎన్నికల తనిఖీల్లో భాగంగా తిర్పూర్ సమీపంలో సోదాలు జరుపుతున్నప్పుడు అటుగా వచ్చిన ఓ కంటెయినర్ ను అనుమానం వచ్చి ఓపెన్ చేసి చూడటంతో 1000, 500 నోట్ల కట్టలు కనిపించాయి.

అవాక్కయిన పోలీసులు వాటిని పరిశీలిస్తూ… ఈసీకి, ఐటీ శాఖకు సమాచారం ఇస్తుండగానే, అదే తరహా మరో రెండు కంటెయినర్లు పట్టుబడ్డాయి. వాటి నిండా కూడా డబ్బు కట్టలే. మొత్తమ్మీద మూడు కంటైనర్లలో కలిపి 765 కోట్లుగా తేలాయి. కరెన్సీ కట్టలపై ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ సీల్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం ఎవరిది? ఎక్కడికి తీసుకు వెళుతున్నారన్న విషయమై దర్యాఫ్తు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు.

కాగా, ఇవి బ్యాంకుకు చెందిన డబ్బని… వాటిని తీసుకువెళుతున్న వారు తెలిపారు. వీటిని కోయంబత్తూరు నుంచి విజయవాడ, హైదరాబాద్ కు తరలిస్తున్నట్టు తెలిపినట్టు సమాచారం. అయితే వాళ్ళు చెప్తున్నట్లు నిజంగా బ్యాంక్ కు సంబంధించిన డబ్బులేనా? లేక ఎన్నికల నేపధ్యంలో తరలిస్తున్న డబ్బా? అన్నది తేలాల్సి ఉంది.