ekkadiki-pothavu-chinnavada-audio-function-nikhil-manchu-vishnuకొన్నిసార్లు సరదాగా చోటు చేసుకున్న సంఘటనలు కూడా హాట్ హాట్ గా సందడి చేస్తుంటాయి. అలాంటి ఓ సరదా సంఘటనే ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఆడియో సక్సెస్ మీట్ లో సంభవించింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసిన మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. వేదికపైకి వచ్చిన మంచు విష్ణు… “అవకాశం దొరికితే నా సినిమాల ఆడియో వేడుకలే ఎగ్గొట్టేయాలని చూస్తుంటాను, కానీ నీ కోసం ఈ ఫంక్షన్ కు వచ్చాను” అంటూ హీరో నిఖిల్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.

“నాన్న గారికి వైజాగ్ లో 40 ఇయర్స్ వేడుకలు జరుపుతున్నపుడు 102 జ్వరంతో ఉండి కూడా వచ్చావు, ఆ కృతజ్ఞతతోనే నేను ఈ వేడుకకు వచ్చాను, అంతేగానీ మున్ముందు నన్ను ఆడియో ఫంక్షన్స్ కు పిలవొద్దు” అంటూ విష్ణు చెప్తున్న తరుణంలో… మైక్ అందుకున్న నిఖిల్… “మోహన్ బాబు గారి వేడుకకు నన్ను పిలవడమే ఎక్కువ, ఆ రోజు మీరు చూపించిన ఆతిధ్యం మరిచిపోలేను, మీరు కోరుకున్నట్లే… ఇక నుండి మిమ్మల్ని ఆడియో ఫంక్షన్స్ కు పిలవను” అంటూ సరదాగా చెప్పేసాడు.

“తానూ గొప్ప వ్యాఖ్యతను కాదని, అందుకనే ఈ ఆడియో వేడుకలంటే తనకు ఇబ్బందిగా ఉంటాయని, నాకు చాలా మొహమాటం, స్టేజ్ పైన జనాల ముందు మాట్లాడడం తనకు ఆసక్తిగా ఉండదని, ఏది ఏమైనా… ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వశక్తితో పైకి వస్తున్న నీ లాంటి హీరోలే ఆదర్శమని, మీ శ్రమే మీకు విజయాన్ని ఇస్తుందని, ఖచ్చితంగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా సక్సెస్ అందుకుంటుందని వ్యాఖ్యానించాడు మంచు విష్ణు.

సహజంగా ఎప్పుడూ మంచు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు మీడియా వర్గాలలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా హల్చల్ చేస్తుంటాయి. లేదంటే ఒక దుమారాన్ని లేపుతుంటాయి. అయితే ఇటీవల కాలంలో మోహన్ బాబు మైక్ ముందుకు రావడం బహు అరుదుగా కావడంతో, దానిని మంచు విష్ణు పుణికిపుచ్చుకున్నాడేమో అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. లేదంటే తండ్రి మాదిరి స్ట్రెయిట్ గా మాట్లాడడం విష్ణుకు కూడా అలవాటైపోయిందేమో..!