Duvvada Jagannadham - Harish Shankar Latestదిల్ రాజు నిర్మిస్తున్న 25వ సినిమాగా “దువ్వాడ జగన్నాధమ్” ఈ నెల 23వ తేదీన విడుదల కాబోతోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని హంగులను పూర్తి చేసుకుంది. తాజాగా సెన్సార్ బోర్డు నుండి ‘యు/ఎ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ సెంటర్స్ లో విడుదల చేయడానికి దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. వరుస హిట్స్ తో మాంచి ఊపులో ఉన్న బన్నీ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ రాబట్టే చిత్రంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదిలా ఉంటే… ఇటీవల కాలంలో ఏ సినిమా అయినా సెన్సార్ పూర్తయిన వెంటనే… సెన్సార్ టాక్ పేరుతో సదరు సినిమాలోని హైలైట్స్, నెగటివ్ పాయింట్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం సహజమై పోయింది. ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ మూవీ ‘బాహుబలి 2’ విషయంలో కూడా ఇది జరిగింది. కానీ, ‘డీజే’ సెన్సార్ టాక్ మాత్రం ఎక్కడా ప్రత్యక్షం కాకపోవడంతో… సెన్సార్ టాక్ బయటకు పొక్కకుండా ‘దిల్ రాజు అండ్ కో’ పలు జాగ్రత్తలు తీసుకున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల ముందు వరకు భారీ బజ్ ఉంది. బ్రాహ్మణుడి పాత్రలో అల్లు అర్జున్ వైరేటీ సినిమా చేస్తున్నారన్న అంచనాలు ఏర్పడగా, ధియేటిరికల్ ట్రైలర్ విడుదల తర్వాత ఓ పక్కా కమర్షియల్ మాస్ సినిమా మాత్రమే అన్న విషయం స్పష్టమైంది. దీంతో అప్పటివరకు నెలకొన్న అంచనాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కనీసం ‘సెన్సార్ టాక్’ వచ్చిన తర్వాత అయినా భారీ క్రేజ్ వస్తుందని అభిమానులు ఆశిస్తే… అది కూడా అడియాశలు కావడం నిరుత్సాహ పరిచే అంశం.