రాష్ట్ర విభజన జరిగి రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్దిలో పరుగులు పెట్టాల్సిందిపోయి, అవినీతి, అక్రమాల భాగోతాల బారిన పడుతున్నాయి. తెలంగాణాలో ఒక సాధారణ కానిస్టేబుల్ వెనకేసిన ఆస్తుల చిట్టా విOటే… ఈయన కానిస్టేబులా? లేక పెద్ద వ్యాపారవేత్త? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే విచారణలో తేలిన నిజాలు ఏమిటంటే… ఈ సాధారణ కానిస్టేబుల్ వెనుక రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారని! ఒక్క కానిస్టేబుల్ విషయంలోనే కాదు, హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న అనేక దందాలలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఎప్పటి నుండో సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇక, ఏపీ విషయానికి వచ్చేసరికి… ప్రస్తుతం కల్తీ మద్యం, కాల్ మనీ అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ రెండింటి బ్యాక్ గ్రౌండ్ ను తిరగేసినా పొలిటిషియన్స్, పోలీసులే కనపడుతున్నారు. కల్తీ మద్యం వెనుక కాంగ్రెస్ నాయకుడు మల్లాది విష్ణు పేరు వెలుగులోకి రాగా, కాల్ మనీలో అయితే అన్ని పార్టీల రాజకీయ నేతల పేర్లు వినపడుతున్నాయి. అంతే కాదు, పోలీసుల అండదండలతోనే ఈ తతంగమంతా జరుగుతోందన్న నిజాలు బయటకు వస్తున్నాయి. సామాన్య ప్రజలకు న్యాయం కావాలని వెళుతున్న పోలీసులే అక్రమార్కులతో కలిసిపోతే, ఇక జనం పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
అయితే ఇదేదో ఈనాడు మొదలైన విషయం కాదు, గతంలో ఎన్నో కేసుల్లో జరిగిందే. జగన్ అక్రమాస్తుల కేసులలో అయితే ఏకంగా ఐఏఎస్, ఐపీఎస్ లే నిందితులుగా ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ఇలా ‘ప్రజాసేవ’ పేరుతో రాజకీయ నాయకులు చేస్తున్న దందాలకు పోలీసులు వంతపాడితే సామాన్యులకు న్యాయం ఎక్కడ దొరకుతుంది? దీన్ని తుదముట్టించేది ఎవరు? ఎవరో వస్తారు… ఏదో చేస్తారని… ప్రజలు కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు… మరి వారి ఆశ తీరేదెప్పుడు..?! అసలు ఆ అవకాశం ఉందంటారా..!?