DSP backఎప్పుడు హుషారుగా, ఉత్సాహంగా వుండే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఇంట నెలకున్న ‘విషాదం’ అందరికీ తెలిసిందే. ఈ ప్రభావం దేవి సంగీతం అందిస్తున్న “నేను… శైలజ.., నాన్నకు ప్రేమతో…” చిత్రాలపై పడుతుందేమోనని సినీ వర్గాలు అంచనా వేసాయి. కానీ ఆశించిన దాని కంటే త్వరగానే దేవి కోలుకోవడం ఆయన అభిమానులకు మిక్కిలి సంతోషాన్నిస్తోంది.

దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన “నేను… శైలజ…” చిత్ర ఆడియో వేడుక దేవి లేకుండానే ముగిసింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో” సినిమా ఆడియో వేడుకైనా దేవి హాజరవుతారా? లేదా? అన్నది సందేహంగా మారింది. అయితే, దేవి తన మునుపటి వైభవానికి వచ్చేసాడని చెప్పడానికి “స్కై ఫెస్ట్” వేదికగా నిలిచింది. గచ్చిబౌళి స్టేడియంలో జరుగుతున్న స్కై ఫెస్ట్ మూడవ రోజు నాడు దేవిశ్రీ పాల్గొని విచ్చేసిన ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ‘గబ్బర్ సింగ్’ నుండి ‘శ్రీమంతుడు’ వరకు అనేక హిట్ ఆల్బమ్స్ లోని సూపర్ హిట్ సాంగ్స్ ను ఆడిపాడారు.

దీంతో “నాన్నకు ప్రేమతో” వేడుకపై దేవి ఆగమనం ఖరారయ్యిందని చెప్పవచ్చు. ఇక, మరో 24 గంటల్లో దేవి హంగామా షురూ కానుంది. ఆడియో అదిరిపోయిందనే టాక్ ఇండస్ట్రీ వర్గాలలో హల్చల్ చేయడంతో, బుడ్డోడు అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.