drugs narcotics caseసుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో రోజూ కొత్త పేర్లు వస్తూనే ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, మరియు దీపికా పదుకొనే వంటి పేర్లను ఇప్పటికే మనం విన్నాం. తాజాగా ఈ జాబితాలో కొత్తగా మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరుని ఒక మీడియా ఛానల్ తెర మీదకు తెచ్చింది.

నమ్రతాతో సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయ సాహా చేసిన వాట్సాప్ చాట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్కానర్ పరిధిలో ఉన్నాయని ఇండియా టుడే న్యూస్ ఛానల్ తెలిపింది. అయితే ఆ చాట్లలో ఏం ఉంది అనేది మాత్రం ఆ ఛానల్ చెప్పలేదు. రియా చక్రవర్తితో జయ చాట్లు వెలువడినప్పుడు ఈ కేసు మొదట బయటపడింది.

ఈ కేసుకు సంబంధించి కొంతమంది బాలీవుడ్ నటులను ప్రశ్నించడానికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమాయత్తమవుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తా నివేదికలు బాలీవుడ్ వర్గాలలో భారీ సంచలనాన్ని సృష్టించాయి. అయితే, దీని గురించి ఎన్‌సిబి అధికారికంగా ప్రకటించలేదు. దీనితో ఇది రేటింగ్స్ కోసం మీడియా సృష్టా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

గతంలో బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో నటించిన నమ్రతా పెళ్లి తరువాత సినిమాలకు దూరం అయ్యింది. అయితే ముంబైలో ఆమె కుటుంబం ఉంటుంది. అలాగే ఆమె బాలీవుడ్ తో బానే సంబంధాలు నెరుపుతుంది. మహేష్ బాబు కార్పొరేట్ డీల్స్ వ్యవహారాలు అన్నీ ఆమె చూస్తూ ఉంటారు.