drugs mafia Akun-Sabharwal-డ్రగ్స్ కేసును విచారిస్తున్న ఎక్సైజ్ ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ చేసిన తాజా ప్రకటన సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో కొందరు సినిమా పెద్దలు, బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారుల పిల్లలు ఉన్నారని, అయితే వారి పేర్లు వెల్లడించవద్దంటూ తమపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయని పేర్కొనడం సంచలనంగా మారడంతో, ఈ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి.

పోలీసులపై ఒత్తిడి తెచ్చేంత సీన్ సాధారణ సినీ సెలబ్రిటీలకు ఉండే అవకాశం లేదు కాబట్టి, వ్యవస్థలో బాగా పలుకుబడి కలిగిన వారే ఇందులో ఉన్నట్లుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ కేసులో ఇప్పటికే ఇద్దరు పెద్ద నిర్మాతల కుమారులు, ఓ పెద్ద నటుడి కుమార్తె, ఓ పత్రికాధిపతి ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నా, తొలి జాబితాలో వారి పేర్లను ఎక్కించలేదు. దీంతో రెండో జాబితాలోకైనా వస్తాయా? లేక ఈ కేసు నీరు గారిపోయినట్టేనా? అన్న సందేహాలు నెలకొంటున్నాయి.

అలాగే ఈ కేసులో అధికార పార్టీకి చెందిన ప్రముఖ నేత కుమారుడి పేరు కూడా వెలుగులోకి రావడం పెను సంచలనంగా మారింది. రాయలసీమకు చెందిన మైనింగ్ కాంట్రాక్టర్ ద్వారా ఆయన ఎల్ఏఎస్‌డీ తెప్పించుకునే వారన్న ఆరోపణలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎవరినీ వదల వద్దని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే అధికారులకు పూర్తి అధికారం ఇచ్చినా ఆ నేత వ్యవహారంలో మాత్రం గప్‌ చుప్‌ గా వ్యవహరించాలని అధికారులు నిర్ణయం తీసుకోవడం వెనక పెద్ద తలకాయల ఒత్తిళ్లే ఉన్నట్టు తెలుస్తోంది.

డ్రగ్స్ కేసులో ఉన్న ‘పెద్దల’ పిల్లలను ముట్టుకునే సాహసం చేసే ప్రసక్తే లేదని, అది అనుకున్నంత సులభం కాదని స్వయంగా అధికారులే అనధికారికంగా వ్యక్తపరుస్తున్నట్లుగా మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్నాయి. రాజకీయ అండదండలు ఉన్న వారికి గుట్టుచప్పుడు కాకుండా వారి ఇంటికే వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేయాలన్న ఒత్తిళ్లు ప్రధానంగా వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోతున్న రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.