కరోనా కారణంగా సంక్రాంతి పెద్ద సినిమాలు ఇచ్చిన షాక్ నుండి టాలీవుడ్ కోలుకునే లోపే మరో షాక్ తెలుగు చిత్ర పరిశ్రమను తాకే సూచనలు కనపడుతున్నాయి. ఇది ఓమిక్రాన్ రూపంలో ఉన్న కరోనా గురించి కాదు, ఏపీలో జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న టికెట్ ధరలకు సంబంధించిన అంశం.
హైకోర్టు విచారణలో ఏపీ టికెట్ ధరల అంశం తదుపరి విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేయడంతో, ఫిబ్రవరి 4వ తేదీన విడుదలకు ప్లాన్ చేసిన “ఆచార్య”పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. అఫిడవిట్ దాఖలు చేసేందుకు అడ్వకేట్ జనరల్ సమయం కోరడంతో, ఫిబ్రవరికి 10కి తదుపరి వాయిదా పడింది.
ఇదిలా ఉంటే ఈ అంశంపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి మీడియా వేదికలుగా పలు సందర్భాలలో ఏపీ సీఎంను వేడుకున్నారు. అలాగే చర్చలు జరిపేందుకు అప్పాయింట్మెంట్ కూడా అడిగారు. కానీ దానికి జగన్ విముఖత చూపడంతో, ప్రస్తుతం “ఆచార్య” రిలీజ్ కూడా ఎటూ పాలుపోని స్థితిలో పడిందన్నది టాలీవుడ్ టాక్.
ప్రస్తుతం చర్చల దశలో ఉన్న కమిటీ ద్వారా టికెట్ ధరలు సానుకూల ప్రకటన వస్తే తప్ప, ‘ఆచార్య’ రిలీజ్ కావడం కష్టమన్నది ట్రేడ్ వర్గాలు తేల్చి చెప్తున్నారు. అయితే 1వ తేదీన స్వయంగా సీఎం టికెట్ ధరలను ప్రస్తావించడంతో, మళ్ళీ వాటిని సవరిస్తారా? అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి.
ఏది ఏమైనా ఇటీవల రాంగోపాల్ వర్మ అన్నట్లు… కరోనాను, జగన్ సర్కార్ ను ఏమీ చేయలేము, భరించాల్సిందేనని సర్దిచెప్పుకోవడమే టాలీవుడ్ కు మిగిలింది.