ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయ్యింది నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు కేసు. మాస్కులు అడిగినందుకు గానూ ఆయనను పిచ్చోడిగా ముద్రవేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు వచ్చాయి. ఈ కేసు హైకోర్టు వరకు వెళ్లడంతో ఆ కేసును సిబిఐకి అప్పగించింది న్యాయస్థానం. సిబిఐ దర్యాప్తు కూడా నమోదు చేసింది.
తనకు సరైన వైద్యం అందించడంలేదని, సంబంధంలేని మెడిసిన్ ఇవ్వడంతో ఆరోగ్యం దెబ్బతింటోందని ఇటీవల సుధాకర్ ఏపీ హైకోర్టుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. వైద్యసేవలందిస్తున్న డాక్టర్ పై అభ్యంతరం తెలపడంతో ఆయనకు వైద్యం సేవలందిస్తున్న వైద్యుడిని మార్చారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి పర్యవేక్షణలో డాక్టర్ మాధవిలత ఆయనకు వైద్యసేవలందించనున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు. ఆయనకు కనీసం మరో రెండు వారాలపాటు విశాఖలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో చికిత్స అందించనున్నట్లు సమాచారం. ఆయన్ను ప్రత్యేకంగా ఒక గదిలో ఉంచి ఇద్దరు కుటుంబసభ్యుల పర్యవేక్షణలో వైద్యం చేస్తామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
తన ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులకు చెబుతూ వైద్యాన్ని నిరాకరిస్తున్నప్పటికీ.. ఆయన మానసిక సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు తేల్చారు. ఇకపోతే… సిబిఐ విశాఖపట్నంలో గుర్తుతెలియని పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, మరికొందరిపై 120-బీ, 324, 343, 379, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. నేరపూరిత కుట్ర, కావాలని దూషించడం, మూడు రోజులకు పైగా అక్రమ నిర్బంధం, దొంగతనం, బెదిరింపులకు పాల్పడ్డారంటూ వీరిపై విశాఖపట్నం సీబీఐ ఎస్పీ పుట్టా విమలాదిత్య కేసు నమోదు చేశారు.