Divya spanadana controversial tweet on narendra modiకాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ హెడ్, ప్రముఖ హీరోయిన్ అయిన దివ్య స్పందన అలియాస్ రమ్య చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. సర్దార్ పటేల్ ‘ఐక్యతా విగ్రహం’ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ తెల్లని కుర్తాలో నిల్చున్న ఫొటోను షేర్ చేసిన దివ్య… ‘అది పక్షి రెట్టా?’ అంటూ కాప్షన్ తగిలించింది. క్షణాల్లోనే ఈ ట్వీట్ కాస్తా వైరల్ అయింది. ప్రధానిని పక్షిరెట్టగా అభివర్ణించడంపై బిజెపి వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తనపై విమర్శలు జడివాన కురుస్తున్నా దివ్య మాత్రం వెనక్కి తగ్గలేదు. ట్వీట్‌ను వెనక్కి తీసుకోవడానికి కానీ, క్షమాపణలు చెప్పడానికి కానీ ఆమె అంగీకరించలేదు. రమ్య ట్వీట్‌పై స్పందించిన బీజేపీ.. కాంగ్రెస్ నిజ స్వరూపం ఇదేనని విమర్శించింది. కాంగ్రెస్ విలువలకు ఇదో ఉదాహరణ అని మండిపడింది. దివ్య స్పందన గతంలోనూ ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మోడీని దొంగగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన యూపీకి చెందిన ఓ న్యాయవాది సయ్యద్ రిజ్వాన్ అహ్మద్ ఆమెపై దేశద్రోహం, ఐటీ చట్టం కింద కేసు పెట్టారు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని దివ్య… మోడీ ముమ్మాటికీ దొంగేనని మరోమారు ట్వీట్ చేశారు. దివ్య డేరింగ్ ను మెచ్చుకునే వారు ప్రశంసలు అందిస్తుండగా, ఒక ప్రధానిని పక్షి రెట్టగా పోల్చడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసేవారూ ఉన్నారు.