director-vamsi-paidipally-lauds-fidaa-movieచాలాకాలం తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “ఫిదా”సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకులను పలకరించనుంది. అయితే రెండు రోజులు ముందే పలువురు సినీ సెలబ్రిటీలకు నిర్మాత దిల్ రాజు ప్రీమియర్ షో ఏర్పాటు చేసి “ఫిదా” సినిమాను చూపించారు. ఈ జాబితాలో ప్రిన్స్ మహేష్ బాబు 25వ సినిమాకు దర్శకత్వం వహించనున్న వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు. ఈ సినిమా చూసిన అనంతరం సోషల్ మీడియా వేదికగా తన భావాలను పంచుకున్నారు వంశీ.

“ఫిదా” సినిమాను ఇప్పుడే చూసాను, అందమైన ప్రేమకధ… ఆనంద్, గోదావరిల తర్వాత శేఖర్ సర్ గారి కధలను చాలా మిసయ్యాను, కానీ ‘ఫిదా’తో అది తీరిపోయింది. సినిమాలో వరుణ్ తేజ్ అద్భుతంగా చేసాడు, పాత్రకు జీవం పోసాడు అంటూ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఇక ‘భానుమతి’గా నటించిన సాయిపల్లవి నటన మాటల్లో చెప్పలేనిదని, ‘ఫిదా’ సినిమాకు భానుమతి పాత్ర ద్వారా ప్రాణం పోసావు… అమోఘంగా నటించిందంటూ కితాబిచ్చారు.

ఈ సినిమాను నిర్మించిన దిల్ రాజు మరియు చిత్ర యూనిట్ సభ్యులకు అభినందలు తెలిపారు వంశీ. మొత్తమ్మీద సెలబ్రిటీల ప్రీమియర్ షో నుండి మంచి స్పందన తెచ్చుకోవడంతో, “ఫిదా” యూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది. ఇదే టాక్ ను ప్రేక్షకుల నుండి సొంతం చేసుకుంటే, బాక్సాఫీస్ వద్ద సినిమాకు తిరుగుండకపోవచ్చు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దుమ్ము లేపుతుంది… పక్కా… అంటూ, మునుపెన్నడూ లేని విధంగా దర్శకుడు శేఖర్ కమ్ముల పూర్తి విశ్వాసాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.