Director-Tejaడైరెక్టర్ తేజ ఈజ్ బ్యాక్… అవును ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా అద్భుతమైన ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడంతో, ప్రస్తుతం ఆ ఆనందంలో మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చే కార్యక్రమాలలో పాల్గొంటున్నారు డైరెక్టర్ తేజ. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుందన్న సంకేతాలు స్పష్టం కావడంతో… సహజంగానే తేజ వాయిస్ లో డెప్త్ పెరిగింది. సక్సెస్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ వ్యక్తులలో కలిగే సహజమైన మార్పే గానీ, ఇందుకు తేజ కూడా ఏమీ మినహాయింపు కాదని నిరూపణ అవుతోంది.

ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించిన తేజ, తాజాగా టాలీవుడ్ లో కలకలం రేపిన డ్రగ్స్ ఉదంతంపై కూడా తన భావాలను పంచుకున్నారు. “ఆరేడు తరగతి పిల్లలు డ్రగ్స్ తీసుకుంటారని తెలిసింది, మన జాగ్రత్త వారిపై ఉంచాలి. అంతేగానీ సినిమా వాళ్ళందరూ ఒక్కొక్కరు బడితల్లా, దున్నపోతుల్లా ఉన్నారు. వాళ్ళు ఉంటే ఎంత… పోతే ఎంత..?” అంటూ సినీ సెలబ్రిటీల కేంద్రంగా ఇటీవల జరిగిన సిట్ విచారణపై పరోక్షంగా కాస్త గట్టిగానే బదులిచ్చారు తేజ.

ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలనే తన సినిమాలో చూపించాను తప్ప కొత్తగా ఏం చెప్పలేదని, ప్రస్తుతం అన్ని పార్టీలు డబ్బులున్న వ్యక్తులకే కదా సీట్లు ఇస్తున్నాయి అదే నేను చూపించాను అన్న తేజ, త్వరలో క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్న పవన్ కళ్యాణ్ పై కూడా తన అభిప్రాయాన్ని తెలిపారు. ‘తనకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక మంచి హృదయం ఉన్న వ్యక్తి, అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం మంచిదే, దేశానికి కూడా మంచి జరుగుతుంది’ అంటూ తన అభిప్రాయాలను పంచుకున్నారు.