Director Teja comments on Reviewersఒక సినిమా విడుదలైంది అంటే… ‘ఎలా ఉంది?’ అన్న ఆతృతతో ఆయా సినిమాల ‘రివ్యూ’లు చదవడం ఒకప్పుడు ప్రేక్షకుల వంతు! కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆడియన్స్ ఎదురు చూపుల కంటే కూడా ముందుగా తాము తీసిన సినిమాకు ఎలాంటి రివ్యూ వస్తుందోనని నిరీక్షించడం డైరెక్టర్ల వంతవుతోంది. అవును… ఇది నిజం..! గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో ఇదే జరుగుతోంది. సినిమా విడుదలైన వెంటనే రివ్యూలు రాసే వ్యక్తులపై డైరెక్టర్లు చెలరేగిపోతూ విమర్శలు చేస్తున్న వైనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ‘దువ్వాడ జగన్నాధమ్’ సినిమా విషయంలోనూ డైరెక్టర్ హరీష్ శంకర్ నోరు పారేసుకున్న విషయం తెలిసిందే.

తాజాగా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న “నేనే రాజు నేనే మంత్రి” సినిమాల రివ్యూల విషయంలోనూ దర్శకుడు తేజ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ‘మార్నింగ్ షో పడిన తర్వాత సెకండాఫ్ బాలేదన్నారని, నిజానికి సినిమాలో హీరో క్యారెక్టర్ డౌన్ అయ్యింది గానీ కధ డౌన్ కాలేదని, ఇది పట్టుకుంటారా లేదా అని తాను అనుకున్నానని, ఓ నలుగురైదుగురు మాత్రం క్యాచ్ చేసి రాసారని, వారికి తన హ్యాట్సాఫ్ అంటూ చెప్పిన తేజ, మిగిలిన వారిని మాత్రం ఆ దేవుడు కూడా రక్షించలేడు… అంటూ ప్రసంగించారు. ఒకప్పుడు తెలుగులో మంచి రచయితలు ఉండేవారని, ఇప్పుడు కూడా ఉన్నారని, కానీ సరిగా పట్టుకోలేకపోతున్నారని అన్నారు.

ఒక్క తేజనే కాదు… ప్రస్తుతం ఏ పెద్ద సినిమా విడుదలైనా… ముందు ప్రేక్షకుల టాక్ కంటే, రివ్యూలు పాజిటివ్ గా వస్తున్నాయా? నెగటివ్ గా వస్తున్నాయా? అన్నదే ముఖ్యంగా చూస్తున్నారని అర్ధమవుతోంది. పాజిటివ్ గా రాస్తే థాంక్స్ చెప్పడం, నెగటివ్ గా రాస్తే విమర్శలు చేయడం ఈ తరం దర్శకులకు సర్వసాధారణం అయిపోయింది. ఇలా రివ్యూల కోసం డైరెక్టర్లు ఎదురుచూస్తున్నారు అంటే… తాము తీసిన సినిమాపై వారికి ఎంత నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు. సినిమా హిట్టయితే తేజ లాగా ‘మార్నింగ్ షోలకు వచ్చే వారు ధర్మామీటర్ లు పట్టుకుని, కొలతలు వేసుకుని వస్తారని, సాయంత్రం షోకు వచ్చేవారు నిజమైన ప్రేక్షకులు’ అని వ్యంగ్యాస్త్రాలు సందిస్తుంటారు, అదే ఫ్లాప్ అయితే హరీష్ శంకర్ ‘డీజే’ మాదిరి ఎదురుదాడి చేస్తుంటారని అర్ధమవుతోంది.