director raghavendra rao working on Pelli Sandadi movie sequelదర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన కెరీర్లో చివరి చిత్రం కోసం పని చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. 100 కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన… కొన్ని చిత్రాలను నిర్మించారు కూడా. ఆయన 1996లో విడుదలైన తన సూపర్ హిట్ చిత్రం పెళ్లిసందడి యొక్క సీక్వెల్ మీద పని చేస్తున్నట్లు సమాచారం.

శ్రీకాంత్, రవలి, దీప్తి భట్ నగర్ నటించిన ఆ చిత్రం అప్పట్లో పెద్ద మ్యూజికల్ బ్లాక్ బస్టర్. స్క్రిప్ట్ పని పూర్తయిన తర్వాతే కాస్టింగ్ గురించి స్పష్టత వస్తుంది. ఈ సినిమా పూర్తయ్యాక రాఘవేంద్రరావు రిటైర్ కావాలని అనుకుంటున్నారు. రాఘవేంద్ర రావు జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ చేస్తారని వార్తలు వచ్చినా అది ఆయన మనసులో లేదని సమాచారం.

ఇది ఇలా ఉండగా.. ఈ సీనియర్ ఫిల్మ్ మేకర్ చివరిసారిగా 2017 లో ఇంటింటా అన్నమయ్య అనే సినిమాకు దర్శకత్వం వహించారు, కానీ ఆ సినిమా విడుదల కాలేదు. దీనికి ముందు, అయన షిర్డీ సాయి మరియు ఓం నమో వెంకటేశాయ అనే రెండు భక్తి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ రెండూ సినిమాలలో నాగార్జున హీరోగా నటించారు.

2006 లో వచ్చిన శ్రీ రామదాసుతో ఆయనకు చివరి సారిగా హిట్ వచ్చింది. అప్పట్లో ఎన్నో హిట్లు ఇచ్చిన ఈ దర్శకేంద్రుడు మరో సారి హిట్ కొట్టాలంటే ఇప్పటి తరం ప్రేక్షకులకు నచ్చేలా సినిమా తీయడంపైనే ఆధారపడి ఉంటుంది. అద్భుతమైన తన కెరీర్ కు ఆయన ఎలా ముగింపు పలకగలరో చూడాలి.