Director Krish - Vaishnav Tej2020 కరోనా పుణ్యమా అని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అత్యంత దారుణమైన సంవత్సరంగా మిగిలిపోయింది. కనుచూపు మేరలో పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకునే అవకాశం కనిపించడం లేదు. దీనితో ఇక ఈ ఏడాది సినిమాలు లేనట్టే అని చెప్పుకోవాలి. దీనితో చాలా సినిమాలు థియేట్రికల్ విండో ని దాటి తమ సినిమాలను డైరెక్టుగా ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నారు.

వైష్ణవ్ తేజ్ మొట్టమొదటి సినిమా ఉప్పెన కూడా రెడీగా ఉన్నప్పటికీ నిర్మాతలు మాత్రం థియేటర్లు ఓపెన్ అయ్యేవరకు వేచి చూడాలి అనే నిర్ణయం తీసుకున్నారు. ఈ లోగా కరోనా సమయంలోనే వైష్ణవ్ తేజ్ క్రిష్ దర్శకత్వంలోని తన రెండో సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. అయితే ఆశ్చర్యకరంగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చెయ్యాలని క్రిష్ ఆలోచనట.

తెలుగులో ఓటీటీ కోసమే ఒక చెప్పుకోదగ్గ సినిమా నిర్మించడం ఇదే మొదటి సారి అవుతుంది. కొండపొలం అనే నవల ఆధారంగా తీస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నల్లమల అడవులలో షూట్ జరుపుకుంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపిస్తుంది. ఈ చిత్రం ఆన్ లైన్ హక్కుల కోసం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ క్రిష్ కు ఆఫర్లు ఇచ్చాయట.

ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్ మెంట్ బ్యాన‌ర్ పై సాయిబాబు జాగ‌ర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి అయ్యిందట. కేవలం 40 రోజులలోనే లిమిటెడ్ బడ్జెట్ లో ఈ సినిమాని పూర్తి చెయ్యాలని క్రిష్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. ప్రస్తుతానికి అంతా అనుకున్నది అనుకున్నట్టుగా అవుతుందట.