దీపా కర్మాకర్ వంద కోట్ల మంది భారతీయు ఆశలు మోసిన క్రీడాకారిణి. ప్రొదునొవా అంటే ఏంటో పెద్దగా తెలియని భారతదేశంలో ఆ క్రీడకు ప్రచారం తీసుకొచ్చిన క్రీడాకారిణి. స్వర్ణం సాధిస్తుందని ఆశతో ఎదురుచూసిన భారతావనికి ఒలింపిక్స్ లో పతకాన్ని కోల్పోవడంతో అంతా నిరాశకు గురయ్యారు. నిజానికి దీపా స్వర్ణానికి గురి పెట్టింది. ప్రొదునొవాలో రెండు అవకాశాలు ఇస్తారు. ఈ రెండు అవకాశాల్లో వచ్చిన స్కోరే పతకాన్ని నిర్ధారిస్తుంది.
తొలుత స్విట్జర్లాండ్, చైనా, ఉజ్బెకిస్తాన్, కెనడా, కొరియాకు చెందిన క్రీడాకారిణులు తమ విన్యాసాలను ప్రదర్శించారు. తరువాత దీపా కర్మాకర్ వంతు వచ్చింది. అప్పటికి స్విస్ క్రీడాకారిని నిరాశలో మునిగిపోగా, చైనా, ఉజ్బెక్ క్రీడాకారిణులు ఆనందంగా ఉన్నారు. దీపా కర్మాకర్ తన తొలి ప్రయత్నాన్ని 14.800 పాయింట్లు సాధించగానే అంతా సంతోషించారు. తరువాతి ప్రయత్నాన్ని దీపా పూర్తి చేయగానే అందరి ముఖాల్లో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. కామెంటేటర్లు కూడా దీపా ప్రదర్శనకు ముగ్దులయ్యారు. 17.000 పాయింట్లు ఖాయమని ప్రకటించారు. దీంతో దీపా కర్మాకర్ కు స్వర్ణం ఖాయమని భావించారు. కోచ్ కూడా అలాంటి భావనలోనే ఉన్నారు.
ఇంతలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీపా కర్మాకర్ ప్లేను రీ ప్లే చేయడం ప్రారంభించారు. జంప్ ను అద్భుతమైన నియంత్రణతో మొదలు పెట్టిన దీప… గాలిలో అద్భుతమైన విన్యాసం చేసింది. ల్యాండింగ్ సమయంలో అద్భుతమైన కంట్రోల్ ప్రదర్శించింది. ఏమాత్రం తొణకలేదు. అయితే ఆమె ల్యాండ్ అయిన సమయంలో డెడ్ ఎండ్ ను టచ్ చేసిందని అంపైర్లు భావించారు. రీ ప్లేలో స్పష్టత లేకున్నా…ఆమె డెడ్ ఎండ్ ను టచ్ చేసినట్టు కనిపించింది.
ఇంచుమించు కూర్చుని లేచినట్టు అనిపించింది. దీంతో ఆమెకు 15.066 పాయింట్లు ఇచ్చారు. దీంతో ఇతర ఆటగాళ్లలో ఆనందం వెల్లివిరిసింది. దీపా కర్మాకర్ అలా డెడ్ ఎండ్ ను టచ్ చేయకుండా నియంత్రించుకుని ఉండి ఉంటే… భారత్ కు ఆమె స్వర్ణాన్ని కానుకగా అందించి ఉండేది… 130 కోట్ల మంది ఆశలను సజీవం చేసినదయ్యేది. అయితేనేం… ఇక్కడివరకు వెళ్ళడానికి ఆమె చేసిన ప్రయత్నం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.