మలయాళ ముద్దుగుమ్మ భావన లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న హీరో దిలీప్ ఉదంతంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించినంత వరకు అంతా దిలీప్ ఆధ్వర్యంలోనే జరిగిందని, ‘ఏ1’ నిందితుడిగా తొలుత పేర్కొన్న పోలీసులు, తాజాగా కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో మాత్రం ‘ఏ8’గా పేర్కొనడం విశేషం.
అక్టోబర్ 3వ తేదీన బెయిల్ పై బయటకు వచ్చిన దిలీప్, కోర్టు తనకు విధించిన బెయిల్ షరతులపై హైకోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలు చేసారు. మరో పక్కన కొనసాగుతున్న దర్యాప్తులో దిలీప్ నిందితుడిగా తేల్చడానికి సరైన ఆధారాలు లభించలేదంటూ పోలీసులు ‘ఏ1’ నుండి ‘ఏ8’కు దిలీప్ పేరును మార్చారు. అయితే ఈ కేసులో అసలేం జరుగుతోంది? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
తీరు చూస్తుంటే, ఈ కేసు నుండి దిలీప్ సక్సెస్ ఫుల్ గా బయటకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న టాక్ వినపడుతోంది. ఇదే జరిగితే… రాంగోపాల్ వర్మ లాంటి ప్రజానీకం ఇండియన్ న్యాయవ్యవస్థపై సెటైర్లు వేసుకోవడానికి ఓ అవకాశం ఇచ్చినట్లే భావించవచ్చు. ఈ కేసులో దిలీప్ పాత్రపై పల్సర్ సునీ, విజీష్ లు పెద్దగా చెప్పకపోగా, చార్లీ మాత్రం గట్టిగా చెప్తున్నారు. అందువలనే ఇంకా ఛార్జ్ షీట్ నుండి పేరు తొలగించలేదు.