Dil-Raju-Mahesh-babuప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం ముగిసిన తర్వాత ‘శ్రీమంతుడు’ దర్శకుడు కొరటాల శివతో మహేష్ ఓ సినిమా చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. మహేష్ కెరీర్ లో 24వ సినిమాగా రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమా తర్వాత ప్రతిష్టాత్మక 25వ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఒక్క అధికారిక సమాచారం తప్ప ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి సమాచారం లేదు. అయితే తొలిసారిగా ఈ సినిమాపై ప్రిన్స్ అభిమానులకు నిర్మాత దిల్ రాజు ఓ స్వీట్ న్యూస్ అందించారు.

సెప్టెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నామని, వచ్చే ఏడాది సమ్మర్ నాటికి విడుదల చేస్తామని, ఓ వినూత్నమైన కధతో ఈ సినిమా నిర్మాణం జరుపుకోబోతుందని, మహేష్ రేంజ్ ను మరింతగా పెంచే విధంగా ఈ సినిమా ఉంటుందని, అత్యంత భారీ వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించనున్నామని దిల్ రాజు స్పష్టత ఇచ్చారు. ఈ సినిమాపై ఇచ్చిన క్లారిటీతో ప్రిన్స్ అభిమానులకు మరో సినిమాకు సంబంధించిన సమాచారం కూడా ఇచ్చేసినట్లయ్యింది.

ఒక సినిమా షూటింగ్ ను పూర్తి చేసి గానీ, మరో సినిమా షూటింగ్ కు మహేష్ ప్రవేశించరన్న విషయం తెలిసిందే. దీంతో కొరటాల శివ దర్శకత్వంలో నటించబోయే సినిమా సెప్టెంబర్ నాటికి పూర్తయిపోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే అప్పటికి షూటింగ్ పూర్తయితే, ఆ సినిమా విడుదల ఈ ఏడాదిలోనే ఉండబోతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిజానికి కొరటాల శివ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ముహూర్తం ఫిక్స్ చేసుకుందని ఇటీవల ఓ టాక్ హల్చల్ చేసింది. కానీ, దిల్ రాజు చేసిన ప్రకటనతో ఈ ఏడాదిలో మహేష్ బాబు నటించిన రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయని చెప్పవచ్చు.