Dil Raju in success moodఈ ఏడాది మంచి ఊపు మీదున్నారు దిల్ రాజు. పంపిణీదారుడిగా, నిర్మాతగా వరుస సక్సెస్ లు చవిచూస్తున్న దిల్ రాజు పేరు మరోసారి ‘టాక్ ఆఫ్ టాలీవుడ్’గా మారింది. ‘పట్టిందల్లా బంగారం’ అవుతుండడంతో దిల్ రాజు ఏ ప్రాజెక్ట్ ను పట్టుకుంటే అది బాక్సాఫీస్ వద్ద ‘బ్లాక్ బస్టర్’ గ్యారెంటీ అన్న విశ్వాసం ట్రేడ్ వర్గాలతో పాటు సినీ ప్రేక్షకుల్లోకి కూడా వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఓ నలుగురు యువ హీరోలకు తమ కెరీర్ లో బెస్ట్ కలెక్షన్స్ అందించిన నిర్మాతగా దిల్ రాజు రికార్డులకెక్కారు.

మెగా హీరో సాయిధరమ్ తేజ్ కెరీర్ లో సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన దిల్ రాజు, “సుప్రీం” ద్వారా సాయి కెరీర్ లో బెస్ట్ హిట్స్ ను అందించాడు. ఇక ఈ ఏడాదిలో సంక్రాంతికి శర్వానంద్ కు “శతమానం భవతి” ద్వారా, నాచురల్ స్టార్ నానికి “నేను లోకల్” ద్వారా, ప్రస్తుతం వరుణ్ తేజ్ కు “ఫిదా” ద్వారా వారి వారి కెరీర్స్ లో భారీ హిట్లను అందించిన నిర్మాతగా దిల్ రాజు నిలిచారు. ఈ నలుగురు యువ హీరోలలో మెగా ముద్ర పడిన ఇద్దరు హీరోలు సాయి, వరుణ్ తేజ్ కెరీర్ లకు టర్నింగ్ పాయింట్ గా దిల్ రాజు పేరు చెప్పుకోవచ్చు.

ఇక ఈ ఏడాది దిల్ రాజు నిర్మించిన భారీ చిత్రం “దువ్వాడ జగన్నాధమ్” కూడా అల్లు అర్జున్ కెరీర్ లో భారీ హిట్ అని నిర్మాత దిల్ రాజుతో సహా బన్నీ, దర్శకుడు హరీష్ శంకర్ లు ప్రకటించారు గానీ, వాటినేమి నమ్మే స్థితిలో ట్రేడ్ వర్గాలు, మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు లేరు. దీంతో బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన “సరైనోడు”నే నిలిచింది. దిల్ రాజు బ్యానర్ లో మరో రెండు సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయన్న సమాచారంతో మరో రెండు బిగ్ హిట్స్ ఆయా హీరోల ఖాతాలలో పడ్డట్లేనా?!