జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తన కమ్ బ్యాక్ గురించి పెదవి విప్పలేదు. అయితే పవన్ కళ్యాణ్ బాలీవుడ్ హిట్ సినిమా పింక్ రీమేక్ చెయ్యడానికి సిద్ధం అవుతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. మొన్న ఆ మధ్య విశాఖలో చేసిన జనసేన లాంగ్ మార్చ్ సక్సెస్ కావడంతో ఇప్పుడు సినిమాలు చేస్తే నష్టమా అని ఆయన ఆలోచనలో పడ్డారని కూడా వార్తలు వచ్చాయి.
దీనితో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అయోమయానికి గురయ్యారు. అయితే దీనిపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. “పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలనే కోరిక వచ్చే ఏడాది తీరుతోంది. పవన్ కళ్యాణ్ డేట్లు ఖరారు కావల్సివుంది, అది కాగానే పూర్తి వివరాలు చెబుతా,” అని దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
దానితో సినిమా ఖరారు అయినట్టే, ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అనేది మాత్రం తేలాల్సి ఉంది. హిందీలో విజయవంతమైన ‘పింక్’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. దీనికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తాడు. ఇంతకీ ఈ పింక్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, ఓ లాయర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది.
ఆ ముగ్గురు అబ్బాయిల్లో ఒకరు ఓ అమ్మాయిపై అత్యాచారం చేయాలని చూస్తాడు. ఆమె తప్పించుకునే క్రమంలో బీర్ బాటిల్తో అతని తల పగలగొడుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ కేసును మొదటి నుంచి డీల్ చేస్తున్న లాయర్ (అమితాబ్ బచ్చన్) ఎలా నెగ్గారు అన్నదే కథ. పవన్ కళ్యాణ్ వయసు, ఇమేజ్ ని బట్టి కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారట.