జనసేన పార్టీకి చెందిన సీనియర్లు కొందరు తనను టార్గెట్ చేయడంపై, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షుడు సుంకర కల్యాణ్ దిలీప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనసేన పార్టీ పెద్దలు అహంతో ఉన్నారని, తనకు వారి కన్నా వంద రెట్లు ఎక్కువ అహముందని చెప్పిన దిలీప్, తన జోలికి రావద్దని, ఎవరు ఏం చేస్తున్నారన్న విషయం, ఎక్కడ ఏం వాగుతున్నారన్న విషయాలను బయట పెడతానని హెచ్చరించాడు. తనపై విమర్శలు చేస్తున్న వారి బాగోతాలకు సంబంధించిన ప్రతి స్క్రీన్ షాట్ తన వద్ద ఉందని అన్నారు.
కొన్ని ఛానల్స్ కు కొందరు ఫోన్లు చేస్తున్నారని, ఇవన్నీ అధినేత పవన్ కు తెలిసే జరుగుతున్నాయో, తెలియక జరుగుతున్నాయో తన వద్ద సమాచారం లేదని చెప్పిన ఆయన, తనను రెచ్చగొట్టిన వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేయడం ఖాయమని అన్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవద్దని పార్టీ పెద్దలను హెచ్చరించగా, గత కొన్ని రోజులుగా సుంకర కల్యాణ్ దిలీప్, జనసేనకు దూరమవుతున్న సంకేతాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఒక్క ఎన్నికలలో కూడా బరిలోకి దిగక ముందే జనసేనలో ముసలం మొదలైందన్న టాక్ ఊపందుకుంది.