టిడిపి, చంద్రబాబు నాయుడు బాధపడితే ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ సంతోషించేది ఎవరో అందరికీ తెలుసు. బావ కళ్ళలో ఆనందం కోసమన్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలని నిర్ణయించడం 24 గంటలలోపు దానికి శాసనసభ చేత ఆమోదముద్ర వేసుకోవడం కూడా జరిగిపోయింది.
జగన్ ప్రభుత్వం చేసిన ఈ పనికి టిడిపిలో అందరూ బాధపడతారు కనుక ‘మిషన్ సక్సస్’ అని వైసీపీ నేతలందరూ జబ్బలు చరుచుకోవచ్చు. కానీ అనాలోచిత నిర్ణయంతో టిడిపికి చేజేతులా మరో ఆయుదం అందించామనే సంగతి మరిచిపోయారు. ప్రభుత్వ నిర్ణయానికి టిడిపి బాధపడుతున్నప్పటికీ, ఇదే అంశంపై రేపు ప్రజల మద్యకు వెళ్ళి జగన్ ప్రభుత్వాన్ని ఎండగట్టకుండా ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు చేయకమానదు. వాటితో కూడా టిడిపి జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చేలేకపోవచ్చు కానీ ఎన్టీఆర్ను అభిమానించే కోట్లాది ప్రజలలో జగన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగేలా చేయగలదు.
అమరావతి కోసం మహాపాదయాత్ర చేస్తున్న రైతులకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. కానీ వారిపై వైసీపీ మంత్రులు విమర్శలు చేస్తుండటంతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ని అవమానించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. కనుక ఇప్పుడు టిడిపి ఇదే అంశంతో ప్రజల మద్యకు వెళితే వారు ఏవిదంగా స్పందిస్తారో ఊహించుకోవచ్చు. కనుక ఈ అనాలోచిత నిర్ణయంతో సిఎం జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు వంటివారికి చాలా సంతోషం కలగవచ్చు గాక కానీ ఈ సంతోషం కోసం వారు టిడిపికి తమ ప్రభుత్వంపై ప్రయోగించేందుకు మరో బలమైన అస్త్రం అందించారని గ్రహించినట్లు లేదు.