మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) సీబీఐకి రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. ఆ కేసు విషయంగా తన వద్ద నిర్దిష్టమైన సమాచారం ఉందని, అయితే ఆ విషయంగా పలుమార్లు సీబీఐని సంప్రదించినా సరైన స్పందన లేదని ఆయన ఆరోపించారు. ఈ కేసులో సహజంగానే సీఎం కుటుంబానికి సంబందించిన వారి మీద కొన్ని ఆరోపణలు చేశారు ఏబీవీ.
అయితే దీనికి ఏపీ పోలీసులు స్పందించిన విధానం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. వివేకా హత్య కేసులో ఏబీవీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని డీఐజీ పాలరాజు అన్నారు. డీజీపీ, ఇతర పోలీసు అధికారులపై ఏబీవీ రాసిన లేఖపై ఆయన స్పందించారు. డీజీపీపై ఏబీవీ నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. వివేకా హత్య జరిగిన అనంతరం కూడా వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ గానే కొనసాగారని వివరించారు.
అప్పుడు ఆ కేసుకు సంబంధించిన కీలక సమాచారం సిట్కు ఎందుకు అందించలేదని ఆయన ప్రశ్నించారు. అయితే అక్కడితో ఆగిపోతే పర్లేదు ఆయన తన పరిధి మాట్లాడి మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏబీ వెంకటేశ్వర రావు హత్య కేసులో నిజాలు తెలియకుండా సీఎం కుటుంబంపై బురదజల్లారు అని డీఐజీ వ్యాఖ్యానించారు. ఈ కేసు ప్రస్తుతం సీబీఐ పరిధిలో ఉంది.
విచారణను ప్రభావితం చేసేలా ఉన్నత స్థాయి లో ఉన్న వారు వ్యాఖ్యలు చెయ్యకూడదు అనేది సహజ న్యాయ సూత్రం. పైగా హతుడి కుమార్తె హైకోర్టులో తనకు అనుమానం ఉంది అన్న వారికి డీఐజీ క్లీన్ చిట్ ఇవ్వడం దారుణం. బహుశా ముఖ్యమంత్రి ని ప్రసన్నం చేసుకునే క్రమం లో ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. అయితే తన కనీస బాధ్యతను విశ్రమించి స్వామి భక్తి ప్రదర్శించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.