తెలంగాణ రాజకీయాలలో 24 గంటలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఈటల రాజేందర్ మెడకు 100 కోట్ల భూ కుంభకోణం చుట్టుకుని ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పైగా ఇదంతా ఆయన మెడకు చుట్టింది కేసీఆరే అని ప్రజలలో గట్టిగా అనుమానాలు ఉన్నాయి. ఈరోజు ఆయన వద్ద ఉన్న వైద్య శాఖను కూడా లాగేసుకున్నారు.
పోర్ట్ ఫోలియో లేని మంత్రిగా ఈటల కొనసాగబోతున్నారు. మరోవైపు… ఆ శాఖను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. కేసీఆర్ కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖను తీసుకోవడం కీలక పరిణామం అనే చెప్పుకోవాలి. కరోనా సమయంలో వైద్య ఆరోగ్య మంత్రి పాత్ర అనేది చాలా కీలకం. తరచూ మీడియా ముందుకు వచ్చి తాజా పరిస్థితి మీద, ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద చెప్పాలి.
ఈటల చాలా వరకు ఆ పాత్రను సమర్థవంతంగానే చేశారు. అయితే ఆ క్రమంలో ఈ మధ్య ఆయన కేంద్ర ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేస్తున్నారు. కేంద్రం సహకరించడం లేదని అనేక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక కేసీఆర్ ఆ శాఖను తీసుకోవడంతో ఇక అటువంటి వ్యాఖ్యలు ఉండవు. కేసీఆర్ తరపున చీఫ్ సెక్రటరీ రోజూ రెండు రివ్యూ మీటింగ్లు పెట్టబోతున్నారట.
చీఫ్ సెక్రటరీ రాజకీయ విమర్శలు చేసే అవకాశం లేదు. మరో పక్క కేసీఆర్ ఎప్పుడో గానీ మీడియా ముందుకు రారు. కాబట్టి ఇది బీజేపీకి మేలు చేసే పరిణామమే. అయితే ఇది అనుకుని చేశారా? అనుకోకుండా చేశారా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది.