dhruva-races-for-blockbuster-overseas-recordsప్రస్తుతం ఉన్న టాలీవుడ్ టాప్ హీరోలలో ఓవర్సీస్ మార్కెట్ లేని హీరో ఎవరు? అంటే టక్కున వచ్చే సమాధానం మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ అని. మెగాస్టార్ శకంలో ఓవర్సీస్ మార్కెట్ లో అంత ఫోకస్ లేకపోవడంతో, మెగా హీరోల సినిమాలకు ఓవర్సీస్ లో ఆదరణ చాలా తక్కువగా ఉండేది. అయితే నెమ్మదిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్కెట్ ఏర్పరచుకోగా, దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలతో అల్లు అర్జున్ కూడా ‘మమా’ అనిపించుకున్నారు.

అయితే టాప్ దర్శకులతో పని చేసినప్పటికీ, రామ్ చరణ్ కు మాత్రం ఒక్క మిలియన్ డాలర్ సినిమా కూడా లేకపోవడం విశేషం. దీంతో డిసెంబర్ 9న రాబోతున్న “ధృవ”తో ఆ ముచ్చట తీర్చుకోవాలని భావిస్తున్న చెర్రీ, దీని కోసం భారీ కసరత్తులే చేసినట్లుగా కనపడుతోంది. ఈ సినిమా ఫస్ట్ షోను యుఎస్ లో ప్రదర్శించనున్నామని ప్రకటించిన ఈ సినిమా నిర్మాత అల్లు అరవింద్, ఈ షోకు “ధృవ” చిత్ర యూనిట్ మొత్తం హాజరవుతామని స్పష్టం చేసారు.

రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ లతో సహా హాజరు కావడం ద్వారా ప్రేక్షకులను సినిమాకు రప్పించగలిగితే… ప్రీమియర్ షోకు ఓపెనింగ్స్ కు కొదవ ఉండదని, సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే… మిలియన్ డాలర్ ను అందుకోవడం తేలిక అవుతుందన్న స్కెచ్ ఈ ప్రణాళిక ద్వారా స్పష్టమైంది. అయితే గతంలో కూడా కొందరు సినిమాలు ఇలాగే ప్రకటించినప్పటికీ, చిత్రం విడుదల సమయం వచ్చేసరికి యుఎస్ ప్రేక్షకులపై ‘సీతకన్ను’ వేసారు. అయితే చెర్రీ ఉదంతం వేరే కావడంతో, ఖచ్చితంగా హాజరు కావచ్చనే సంకేతాలు అందుతున్నాయి.