Dhavala Satyam movie on vangaveeti mohana Rangaవిజయవాడ ‘రక్తచరిత్ర’లో వంగవీటి రాధ ప్రస్థానం నుండి రంగా హత్య వరకు జరిగిన వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని, “వంగవీటి” అనే పేరుతో ఒక సినిమా తీయబోతున్నానని రాంగోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వంగవీటి మోహన రంగా చరిత్రను ఆధారంగా చేసుకుని మరో సినిమా ప్రకటన వచ్చింది.

28 యేళ్ళ క్రితం విడుదలై 26 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న ‘చైతన్యరథం’ రధసారధుడు ధవళ సత్యం దర్శకత్వంలో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రంగా విగ్రహాలను ఏర్పాటు చేస్తూ..ఆయన పేరు మీద ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సాయి సుధాకర్‌ నాయుడు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 23న విజయవాడలో తెలియజేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన చిత్ర నిర్మాత మంచాల సాయి సుధాకర్‌ నాయుడు వివరాలు తెలియజేస్తూ… ”వంగవీటి రాధా-రంగాలకు అత్యంత సన్నిహితులు అవ్వడమే కాకుండా, వారి జీవిత నేపథ్యంలో ‘చైతన్యరథం’ వంటి హిట్‌ చిత్రాన్ని రూపొందించిన ధవళ సత్యం గారినే ఈ చిత్రానికి దర్శకుడిగా ఎన్నుకున్నాం. ఒక విధంగా ఇది ‘చైతన్యరథం’ పార్ట్‌ 2 అనుకోవచ్చు. రంగా గారి జీవితం తెరిచిన పుస్తకం లాంటిదే కాబట్టి కథాంశం సిద్ధంగానే ఉంది. దానికి తగిన స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ కూడా రెడీ అవుతున్నాయి. త్వరలో నటీనట, సాంకేతిక వర్గాన్ని ప్రకటిస్తాం. రంగా గారి సామాజిక వర్గానికే చెందిన ఒక ‘పవర్‌ఫుల్‌ స్టార్‌’ ను రంగా పాత్ర చేయడానికి ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాం. ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని ఆశిస్తున్నాం” అని అన్నారు.