DGP Sambasiva Rao Warns Chiranjeevi and Balakrishna Fansఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా, నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ సినిమాలు విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో రెట్టించిన ఉత్సాహంలో ఉంటున్న ఇద్దరు హీరోల అభిమానులు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. సోషల్ మీడియాలో జరుపుకుంటున్న ప్రత్యారోపణలు శృతిమించుతున్న తరుణంలో… రేపు ధియేటర్ల వద్ద ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అన్న ఉద్దేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ చిరు, బాలయ్య అభిమానులకు ఒక విధమైన ‘వార్నింగ్’ ఇచ్చారు.

పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ డీజీపీ సాంబశివరావు ప్రసంగిస్తూ… చిరంజీవి, బాలయ్య అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. “ఎదుటి హీరో బ్యానర్లు, పోస్టర్లను చింపితే కఠిన చర్యలు తీసుకుంటామని, హీరోలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెడితే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇరు హీరోల అభిమానులు హద్దుల్లో ఉండాలని… హద్దుమీరితే తాట తీస్తామని” ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కు స్పష్టత ఇచ్చారు.

రెండు సినిమాలు విడుదల తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ, ఆయా హీరోల అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపవుతూ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ లు, ఛలోక్తులు వేసుకుంటున్నారు. గత నెల రోజులుగా సోషల్ మీడియాలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న తరుణంలో… నాగబాబు, క్రిష్ వంటి వారు సంయమనం పాటించే విధంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ, ఈ ప్రచారాన్ని ఆపకపోవడంతో, స్వయంగా డీజీపీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. బహుశా ఇప్పుడైనా కాస్త కంట్రోల్ లో ఉంటారేమో చూడాలి.