Dev Katta sensational post“రిపబ్లిక్” సినిమాతో సంచలనంగా మారిన దేవ్ కట్టా పేరు అప్పటి నుండి ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంది. శర్వానంద్ తో తీసిన ‘ప్రస్థానం’ తర్వాత ఆ స్థాయిలో ‘రిపబ్లిక్’కు కీర్తి ప్రతిష్టతలు వచ్చిపడ్డాయి. అందులోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగానికి టాలీవుడ్ నుండి పెద్దగా స్పందన లేకపోయినా, దేవ్ కట్టా మాత్రం పూర్తి మద్దతు పలకడంతో అభిమానుల ఆసక్తిని రాబట్టారు.

అప్పటి నుండి పలు ఇంటర్వ్యూలతో నిత్యం వార్తల్లో నిలుస్తోన్న దేవ్ కట్టా, తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ప్రజలను ఉద్దేశించి ఓ కీలక పోస్ట్ ను పెట్టారు. “అవినీతి రాజకీయ నాయకులను,మోసగాళ్లను, దొంగలను, ద్రోహులను ఎన్నుకునే ప్రజలు బాధితులు కాదని, వాళ్లంతా సహచరులని” ఓ సంచలన పోస్ట్ పెట్టారు.

ఇది ఎవరిని ఉద్దేశించి దేవ్ కట్టా పెట్టారో ట్వీట్ లో పెట్టలేదు గానీ, సరిగ్గా చిరంజీవి బృందం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన రెండవ రోజే పెట్టడంతో, సహజంగా అందరి చూపులు ఆంధ్రప్రదేశ్ లోని ప్రజల వైపే తిరుగుతున్నాయి. ఏపీలో ‘మెగాస్టార్ అండ్ కో’కు తీవ్ర అవమానం జరిగిందని సోషల్ మీడియా అంతా గుప్పుమనడం, ఆ సందర్భంలోనే ఈ పోస్ట్ రావడం కేవలం కాకతాళీయం అనుకోవాలా?

దేవ్ కట్టా చేసిన ఈ పోస్ట్ కు నెటిజన్ల నుండి మంచి స్పందన లభిస్తోంది. తప్పంతా రాజకీయ నాయకులది గానీ, మోసగాళ్ళది గానీ, ద్రోహులది గానీ కాదని వాళ్ళని తమ నేతలుగా ఎంపిక చేసుకునే ప్రజలదే అన్న వ్యాఖ్యలను దేవ్ కట్టా ఈ పోస్ట్ ద్వారా తెలియజేసి, ఓ విధంగా ప్రజలను మేలుకొల్పే ప్రయత్నం చేసారు. ఇదే సమయంలో పాలకులను ఎండకట్టే విధంగా ఈ పోస్ట్ నిలుస్తోంది.